Reading Time: < 1 minute
Ips Officer Sameer Sharma Success Story 24 Backlogs Upsc

సమాజంలో కేవలం పరీక్షల మార్కులను బట్టే ఒకరి భవిష్యత్తును, సామర్థ్యాన్ని అంచనా వేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే.. మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందే విద్యార్థులకు ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ జీవితం ఒక గొప్ప ఆదర్శం. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నత అధికారిగా సేవలందిస్తున్న ఆయన విద్యాభ్యాసం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది.

వరుస విద్యాపరమైన ఎదురుదెబ్బలు..
సమీర్ శర్మ అకడమిక్ రికార్డు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన పదో తరగతిలో కేవలం 57 శాతం మార్కులు మాత్రమే సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పరిస్థితి మరింత క్షీణించి కేవలం 34 శాతం మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీటెక్ చదువుతున్న సమయంలో ఏకంగా 24 సబ్జెక్టులలో బ్యాక్‌లాగ్స్ పడ్డాయి. ఆ సమయంలో ఆయన చుట్టుపక్కల వారు, బంధువులు సమీర్ జీవితంలో ఎందుకూ పనికిరాడని, ఎలాంటి విజయం సాధించలేడని దాదాపుగా అంచనాకు వచ్చేశారు.

పట్టుదలతో సాధించి..
కానీ, సమీర్ శర్మ తన గతాన్ని చూసి కుంగిపోలేదు. తనపై సమాజం ఉంచిన ముద్రను చెరిపేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించే యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. పాత పరాజయాలను పక్కన పెట్టి, పూర్తి పట్టుదల, క్రమశిక్షణతో ప్రిపరేషన్ ప్రారంభించారు. కేవలం 18 నెలల కఠోర శ్రమతో, మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా స్థాయిలో 182వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ (IPS) అధికారిగా ఎంపికయ్యారు.

యువతకు ఒక దిక్సూచి..
తక్కువ మార్కులు వచ్చాయని, అనుకున్న సీటు రాలేదని తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ, ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న నేటి యువతకు సమీర్ శర్మ ప్రయాణం ఒక గొప్ప సందేశం. ఒక పరీక్షలో వచ్చే మార్కులు మన జీవితాన్ని మార్చలేవని, బలమైన సంకల్పం, నిరంతర కృషి ఉంటే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు.