
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం విరాజిల్లుతున్న కలియుగ దేవుడు.. వైకుంఠనాథుడు.. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమలలోని ఏడు కొండలపై భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తులు ఆ కొండలను ఎక్కి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. వాటి పేర్లను ఒకసారి పరిశీలిస్తే 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వెంకటాద్రి 7. నారాయణాద్రి. చాలామంది భక్తులు ఈ కొండలను నడుచుకుంటూ స్వామిని దర్శించుకుంటారు. ఈ కొండల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి.. వీటి పరమార్దం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
హిందువులు అందరూ తమ జీవితంలో ఒక్కసారైనా తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కలియుగ దేవుడు.. వైకుంఠ నాథుడు.. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఏడుకొండలపై పాదయాత్ర చేసి వెంకన్న స్వామిని దర్శించారంటే ఆ అనుభూతి అంతా ఇంతా కాదు. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది.
ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది. అందుకనే ఆయన ఏడుకొండలు పైన ఉంటాడు. ఈ ఏడుకొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. పురాణాల ప్రకారం ఆ ఏడుకొండలు సాలగ్రామాలే. ఆ ఏడుకొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు అన్నీ మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
1. వృషభాద్రి : వృషభం – అంటే ఎద్దు… వృషభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అనే మూడు పాదాలు ఉంటాయి. ఇక రెండు కొమ్ములుంటాయి.
- వాక్కు అంటే – శబ్దం
- శబ్దం అంటే – వేదం
- వేదం అంటే – ప్రమాణము
నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు కదా. నిజంగా దాని కన్నా అబద్దం ఇంకోటి లేదు. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. అంటే దీనిని ఎవ్వరూ చూడలేదనే సమాధానం చెబుతారు . కాని భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి పడుతుంది. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్టై కదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ వృషభాద్రి ఎక్కుతాడు. ఈ సారాంశం తెలిసినా.. తెలియకపోయినా.. గోవింద నామ స్మరణ చేస్తూ అలుపూ..సొలుపూ లేకుండా వృషభాద్రి కొండ ఎక్కుతారు.
2. వృషాద్రి: వృషాద్రి- అంటే ధర్మం .. ధర్మం అంటే – నువ్వు వేదాన్ని అనుసరించి కొన్ని పనులు చేయాలి. మానవులు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. వీటి వలన ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. వాటిని చేయడమే వృషాద్రి కొండను ఎక్కడం.
3. గరుడాద్రి : గరుడ – అంటే పక్షి – … ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.షడ్ – అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.
పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడే భగవానుడు.
- భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
- అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.
అటువంటి భగవానుణ్ణి జ్ఞానంతో తెలుసుకోవడమే గరుడాద్రి.
4. అంజనాద్రి : అంజనం అంటే కంటికి కాటుక.కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, కళ్ల చలవకి.
కంటికి అందం ఎప్పుడు? – ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.
5. శేషాద్రి : ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు.
తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి చేరుకోవడమే శేషాద్రిని ఎక్కడం.
6. వెంకటాద్రి: వెం : పాపం… కట : తీసేయడం. కాబట్టి వెంకటాద్రి ఎక్కితే పాపాలు పోతాయి.
అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
7. నారాయణాద్రి: నారాయణ .. అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలం లో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుసుకొని ఏడుకొండలు ఎక్కాలి..