
Delhi Government: ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ యథావిధిగా కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా బుధవారం, శనివారం రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ దినాలుగా నిర్ణయించారు.
ఇంధన పొదుపు కోసం ప్రత్యేక చర్యలు
వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు కార్యాలయాల పని వేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని సుమారు 20 శాతం తగ్గించడంతో పాటు, కొన్ని శాఖల్లో అధికారుల వాహనాల కాన్వాయ్లను కూడా కుదించారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంధనాన్ని ఆదా చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
మళ్లీ పాత కార్యాలయ వేళలు
తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాధారణ కార్యాలయ సమయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కార్యాలయాల పని వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి యథావిధిగా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా 90 రోజుల పాటు అమలు చేసిన హైబ్రిడ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేయడంతో, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ మళ్లీ పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే పనిచేయనున్నారు.