
OTR : నా మీద హత్యాయత్నం జరిగింది…. టిప్పర్తో గుద్ది నన్ను చంపబోయారని ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుంటున్నా…. అవతలి వాళ్ళకు ఎందుకు కామెడీ అయిపోయింది? నడిరోడ్డు మీద చాపవేసి పడుతున్నా నిన్నెవడూ పట్టించుకోబోడన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రత్యర్థుల సంగతి సరే…. సొంత పార్టీలో సైతం ఆయనకు ఎందుకు సపోర్ట్ లేదు? జిల్లా మొత్తం మీద ఒంటరి అయ్యారంటున్న ఆ నేత ఎవరు? ఏంటా అటాకింగ్ స్టోరీ?
టైం బ్యాడ్ అయితే…. తాడే పాము అవుతుంది, సైకిల్ కింద పడ్డా కాళ్లు విరుగుతాయి. చిన్నవిషయమైనా చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోందట. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలన్నీ ఆయనకు నెగెటివ్గానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఒక యువకుడి ఆత్మహత్య కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకున్న గన్మెన్ను తీసేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక టిప్పర్ గుద్దబోయిందన్నది లేటెస్ట్ మ్యాటర్. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో ఆయన గ్రాఫ్ పెరిగిందంటూ మొన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే రివర్స్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ లిస్ట్ చదివి వినిపిస్తున్నారు టీడీపీ నాయకులు. ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్కు అటెండ్ అయి తిరిగి వస్తుండగా…. శింగనమల దగ్గర ఒక టిప్పర్ తన కారును ఢీకొట్ట బోయిందని చెబుతున్నారు ప్రకాష్ రెడ్డి. ఆ టిప్పర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ది కావడంతో రాజకీయంగా పెద్ద వివాదం రాజుకుంది.
పరిటాల సునీత, సురేంద్రబాబు కలిసి తనను చంపే కుట్ర చేశారని.. ఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరిగిందని ఆరోపించారు తోపుదుర్తి. నేను అధికార పార్టీపై చేస్తున్న పోరాటం, సంధిస్తున్న ప్రశ్నలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. అందుకే నా అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారని.. ఇక నుంచి నా టార్గెట్ లోకేష్ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే… అందుకు టీడీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. అసలు నిన్ను… నీ పార్టీ వాళ్ళే పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు నడి రోడ్డు మీద చాప వేసుకుని పడుకున్నా.. మాట్లాడించే వారు ఉండరు. అలాంటి నిన్ను చంపేందుకు మేము ప్లాన్ వేయడం, దానికి లోకేష్ డైరెక్షన్ చేయడమా…? ఇదంతా కామెడీ కాకుంటే ఇంకేంటి…. అలా చెప్పడానికైనా బుద్ధి ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు ఇంత జరుగుతుంటే నీ పార్టీ వాళ్ళు ఎవరైనా నీ కోసం వచ్చారా.. కనీసం పరామర్శించారా.. అని నిలదీశారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళు ఎవరూ సపోర్ట్ రాబోరని, ఎందుకంటే… నీ వ్యవహారశైలి అలా ఉందని కామెంట్స్ చేశారు టీడీపీ లీడర్స్. దాంతో… నిజంగానే అనంతపురం వైసీపీలో ప్రకాష్ రెడ్డి ఒంటరి అయ్యారా అన్న చర్చలు జరుగుతున్నాయి.
ఆయన తరచూ ప్రెస్మీట్స్లో నా ఓటమికి సొంత పార్టీ వారే కారణమని, వ్యతిరేకంగా పని చేశారని చెప్పడంతో మనస్పర్ధలు తారా స్థాయికి చేరాయట. మా మధ్య విభేదాలు లేకపోతే 14 సీట్లు గెలిచి ఉండేవారమని చెప్పడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటన్నిటినీ పక్కనపెట్టి కూడా…..ప్రకాష్రెడ్డి సోదరుడు రాజా రెడ్డి అరెస్ట్ సమయంలో అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి, మరికొందరు నేతలు సపోర్ట్గా వస్తే…. అనుచరుల నుంచి నిరసన వ్యక్తమైంది. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా తోపుదుర్తి అనుచరులు జనంలో నుంచే కామెంట్స్ చేశారు. దాంతో… ఇప్పుడు ఆయనకు గన్మెన్ను తొలగించినా, నాపై హత్యాయత్నం జరిగిందని చెప్పినా జిల్లాలో ఏ ఒక్క నేతా స్పందించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే.. ప్రకాష్ రెడ్డి జిల్లా పార్టీలో ఒంటరి అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నా వెంట జనం, జగన్ ఉన్నారని ఆయన చెబుతున్నా.. ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన విషయంలో చేస్తున్న కామెంట్స్ మాత్రం వైసీపీలో ప్రకాష్ రెడ్డి పరిస్థితికి అద్దం పడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.