
విజయనగరం జిల్లా రాజాంలో ఓ మహిళా వైద్యురాలిని ప్రేమ పేరుతో పదేపదే వేధించిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెర్లాం మండలానికి చెందిన బాధితురాలు బొబ్బిలి జంక్షన్లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోనే షాపు నిర్వహిస్తున్న పవన్ అనే వ్యక్తి.. క్లినిక్ బోర్డు పై ఉన్న నంబర్ను సేకరించి తరచూ ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ప్రేమ పేరుతో మెసేజ్లు చేయడం స్టార్ట్ చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో వైద్యురాలు అతని మొబైల్ నంబర్ను బ్లాక్ చేశారు.
అయినా పవన్ నుంచి వేధింపులు ఆగలేదు.. అతను మరో మొబైల్ నంబర్తో తిరిగి కాల్స్ చేయడం, మెసేజ్ లు పంపించడం చేసేవాడు. డాక్టర్ ఐ లవ్ యూ.. నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను అంగీకరించు అనే మెసేజ్లతో నిత్యం ఆమెను వేధించేవాడు. అంతటిలో ఆగకుండా.. ఆమె క్లీనిక్కు వచ్చి, వెళ్లేప్పుడు వెళ్ళినప్పుడు వెంటబడటం వంటి పనులు చేస్తుండేవాడు. రోజురోజుకి అతని వేధింపులు పెరుగుడంతో బాధితురాలు రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మహిళలను ఫోన్ కాల్స్, మెసేజ్లు లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.