
Medigadda Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీకి వరద నీటి ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా బ్యారేజీకి ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా కొనసాగుతోంది. ఎగువ నుండి 62,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు అదే స్థాయిలో 62,700 క్యూసెక్కుల నీటిని గేట్ల గుండా దిగువకు వదులుతున్నారు. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో, నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.