Reading Time: 2 minutes
Ayodhya Ram Mandir Donation Scam Sit Probes Bank Deposit Discrepancies

Ram Mandir Donation Scam: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం కానుకల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే కానుకల దొంగతనం కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నగదు వివరాలు దర్యాప్తు సంస్థకు కొత్త అనుమానాలకు తావిచ్చాయి. దొంగతనం వెలుగులోకి రాకముందు జమైన మొత్తంతో, ప్రస్తుతం జమవుతున్న మొత్తాన్ని పోల్చితే భారీ వ్యత్యాసం కనిపించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆర్థిక అవకతవకల కోణంలో విచారణను ముమ్మరం చేసింది.

జమ మొత్తంలో భారీ వ్యత్యాసం

సమాచారం ప్రకారం, దొంగతనం బయటపడక ముందు రామ మందిర ట్రస్ట్‌కు చెందిన ఎస్‌బీఐ, పీఎన్‌బీ బ్యాంకు ఖాతాల్లో రోజుకు సుమారు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు కానుకల నగదు జమయ్యేది. అయితే దొంగతనం వెలుగులోకి వచ్చిన తర్వాత అదే మొత్తం రోజుకు రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని పరిశీలించిన SIT, గతంలో ప్రతిరోజూ సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నగదు పక్కదారి పట్టి ఉండొచ్చని అనుమానిస్తోంది.

బ్యాంకు ఉద్యోగుల విచారణ

ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసేందుకు SIT దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌తో పాటు మొత్తం 10 మంది బ్యాంకు ఉద్యోగులను అధికారులు ప్రశ్నించారు. అలాగే సంబంధిత బ్యాంకు పత్రాలు, లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఇద్దరు, ముగ్గురిపై అనుమానాలు

ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల పాత్రపై అనుమానాలు వ్యక్తమైనట్లు సమాచారం. వారి కార్యకలాపాలు, నగదు లావాదేవీలపై SIT లోతుగా విచారణ కొనసాగిస్తోంది. డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇందులో మరెవరి ప్రమేయం ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం

రామ మందిరం కానుకల వ్యవహారంలో రోజువారీ నగదు జమల్లో కనిపించిన భారీ వ్యత్యాసం కేసును మరింత కీలకంగా మార్చింది. ప్రస్తుతం సేకరించిన ఆధారాలు, బ్యాంకు రికార్డుల ఆధారంగా SIT దర్యాప్తును కొనసాగిస్తుండగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర కానుకల దొంగతనం కేసు సంచలనంగా మారింది.. ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, దర్యాప్తు పరిధి వేగంగా విస్తరిస్తోంది.