
దక్షిణ భారత వంటకాల విషయానికి వస్తే, మనకు మొదటగా గుర్తొచ్చే వాటిలో మసాలా దోసె ఒకటి. దోసె తయారు చేయడానికి, మినపపప్పు, బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత రుబ్బి పులియబెడతారు. ఇది చాల లాంగ్ ప్రాసెస్ అయినా, మీరు ఎలాంటి శ్రమ లేకుండానే మసాలా దోసెను ఆస్వాదించవచ్చు.
మీకు మసాలా దోసె తినాలనిపిస్తుంది… కానీ మీ దగ్గర పిండి రెడీగా లేకపోతే, మీరు బొంబాయి రవ్వతో కూడా మసాలా దోసె వేసుకోవచ్చు. ఈ ఈజీ మసాలా దోసె రెసిపీ ఎలాగో తెలుసుకుందామా…
దోశలాగే రుచిగా ఉండే ఇన్స్టంట్ మసాలా దోశను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ సౌత్ ఇండియా మసాలా దోస రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ – 1 కప్పు
పెరుగు – 1/2 కప్పు
నీరు – అవసరమైనంత
బంగాళాదుంప మసాలా కోసం-
ఉడికించిన బంగాళాదుంపలు – 3 లేదా 4
ఉల్లిపాయ – 1 సన్నగా తరిగినది
పచ్చి మిరపకాయలు – 2
కరివేపాకు – 8/10 రెమ్మలు
ఆవాలు – 1 టీస్పూన్
పసుపు పొడి – 1/2 టీస్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర – సరిపడా
నూనె – తగినంత
తయారీ సమయం – 25 నిమిషాలు
వండే సమయం- 15 నిమిషాలు
మొత్తం సమయం – 40 నిమిషాలు
మసాలా దోసె ఎలా తయారు చేయాలి :
1. ముందుగా, నీటిలో బొంబాయి రవ్వ, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పిండిలా తయారుచేసి, 15 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచండి.
2. పిండి మిశ్రమం తయారయ్యేలోపు, దోసె మసాలా సిద్ధం చేసుకోండి. ఇందుకు ఒక బాండీ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయండి. తరిగిన ఉల్లిపాయలను వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి.
3. తరువాత, పసుపు, ఉప్పు వేయండి. ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంపలను వేసి బాగా కలపండి. చివరగా, కొత్తిమీర ఆకులు వేస్తే దోస మసాలా రెడీ.
4. 15 నిమిషాల తర్వాత, బొంబాయి రవ్వ పిండి మరీ చిక్కగా అనిపిస్తే, దోసె పిండి లాంటి చిక్కదనం వచ్చేలా కొద్దిగా నీళ్ళు కలపండి. బాగా కలిపి, మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు అలానే ఉంచండి.
5. ఇప్పుడు నాన్-స్టిక్ పెనంని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. పెనం మీద కొద్దిగా నీళ్ళు చల్లి తుడవండి. ఇప్పుడు పెనంని ఒక ఉల్లిపాయ ముక్కతో రుద్దండి. దీనివల్ల దోసె అంటుకోకుండా ఉంటుంది.
6. ఇప్పుడు మంట తగ్గించి, పెనం మధ్యలో ఒక టేబుల్ స్పూన్ పిండిని పోయండి. గరిటెతో పిండిని లోపలి నుండి బయటకు గుండ్రంగా పరచండి.
7. దోసె అడుగుభాగం బంగారు రంగులోకి మారి, కరకరలాడటం మొదలైనప్పుడు, మధ్యలో 2-3 టేబుల్ స్పూన్ల రెడీ చేసుకున్న బంగాళదుంప మసాలాను పెట్టండి. అంతే ఇప్పుడు దోసెను రెండు వైపులా మడవండి.
8. వేడి వేడి, కరకరలాడే బొంబాయి రవ్వ మసాలా దోసె రెడీ అయిపోతుంది. పెనం నుండి తీసి కొబ్బరి చట్నీ, టమాటా-ఉల్లిపాయ చట్నీ లేదా వేడి సాంబార్తో వడ్డించండి.
ALSO READ : Sunday Special: ఎనర్జీ ఎగ్… కమ్మని రుచి..సూపర్ వెరైటీస్..ఫుల్ ఇమ్యూనిటి పవర్