Reading Time: 2 minutes
Apollo Micro Systems Multibagger Defense Stock Fund Raising Board Meeting

Apollo Micro Systems: షేర్ మార్కెట్లో రక్షణ రంగానికి (డిఫెన్స్) చెందిన కంపెనీల షేర్లు వరుస రికార్డులతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ కంపెనీ ‘అపోలో మైక్రో సిస్టమ్స్’ (Apollo Micro Systems) ఇన్వెస్టర్లకు ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూలై 6 (సోమవారం) న జరగబోయే కంపెనీ బోర్డు సమావేశం వార్తల నేపథ్యంలో.. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 2.39 శాతం వృద్ధితో ముగిసింది. ప్రెఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కంపెనీ భారీగా కొత్త నిధులను సేకరించాలని ప్లాన్ చేస్తుండటమే ఈ జోష్‌కు ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

జూలై 6 బోర్డు మీటింగ్‌పైనే అందరి కళ్లు

హైదరాబాద్‌లోని తమ రిజిస్టర్డ్ ఆఫీస్‌లో జూలై 6వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కీలక సమావేశం జరగనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రెఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ లేదా వారెంట్ల జారీ ద్వారా ఫండ్స్ సేకరించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సెబీ (ICDR) రెగ్యులేషన్స్-2018 నిబంధనల ప్రకారం షేర్ల ధర, నిధుల సేకరణ షరతులు ఖరారు కానున్నాయని తెలుస్తోంది. దీనికి షేర్ హోల్డర్లతో పాటు రెగ్యులేటరీ అనుమతులు కూడా తప్పనిసరి కానున్నాయి.

5 ఏళ్లలో 3,847 శాతం బంపర్ రిటర్న్స్

గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు ఏకంగా 3,847 శాతం మేర మైండ్ బ్లాకింగ్ రిటర్న్స్ అందించింది. అంటే ఐదేళ్ల క్రితం ఇందులో పెట్టిన రూ.1 లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ఏకంగా రూ.39 లక్షలకు పైగా మారింది. కేవలం గత 3 నెలల్లో 128 శాతం, ఏడాదిలో 136 శాతం, మూడేళ్లలో 803 శాతం లాభాలను అందించి ఈ షేరు టాప్ మల్టీబ్యాగర్‌గా నిలిచింది. కంపెనీ భవిష్యత్తుపై నమ్మకంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) తమ వాటాను మార్చి త్రైమాసికంలోని 3.63 శాతం నుంచి జూన్ నాటికి ఏకంగా 6.21 శాతానికి పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రమోటర్ల వద్ద 50.27 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా రక్షణ శాఖ, డీఆర్‌డీఓ (DRDO), ఇస్రో (ISRO), బెల్ (BEL), హెచ్‌ఏఎల్ (HAL) వంటి ప్రభుత్వ సంస్థలకు కీలకమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.1,432 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉండటం వల్ల భవిష్యత్తులో రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫండ్ రైజింగ్ వంటి సున్నితమైన సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు, జూలై 1 నుంచి కంపెనీ ఉద్యోగులు, అధికారుల ట్రేడింగ్ విండోను యాజమాన్యం పూర్తిగా మూసివేసింది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం, రూ.16,336 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ కంపెనీ పీఈ (P/E) రేషియో 152.11 వద్ద ఉంది. అయితే, డెట్-టు-ఈక్విటీ రేషియో కేవలం 0.41 మాత్రమే ఉండటం.. కంపెనీపై అప్పుల భారం చాలా స్వల్పంగా ఉందనే విషయానికి సంకేతం.