
IND Playing XI: వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దుకావడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. చెస్టర్-లీ-స్ట్రీట్లో జరగాల్సిన తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీనితో ఇప్పుడు సిరీస్ను గెలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఇరుజట్లు కనీసం 3 తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన భారత జట్టు ఈ సిరీస్ ఎలాగైనా గలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కారణం ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత్.. ఈ పర్యటనలో తిరిగి గెలుపు బాట పట్టాలని గట్టిగ ప్రయత్నం చేస్తుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ భారత బ్యాటర్లు తమ ఫామ్ ను కొనసాగించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే కూడా 42 పరుగులతో మంచి టచ్ లో ఉన్నాడు.
అయితే భారత జట్టులో ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతున్న ఆటగాడు ‘సంజు శాంసన్’. దీనికి కారణం సూర్యవంశీ అని చెప్పకనే చెప్పవచ్చు. సంజు తొలి మ్యాచ్లో కేవలం 7 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అతని ఆటతీరు కూడా ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో ఈ మ్యాచ్లో అతను తప్పనిసరిగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఫామ్ కూడా భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచడంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్, తిలక్ వర్మలలో ఒకరిని డ్రాప్ చేసి సూర్యవంశీని డెబ్యూ చేసే అవకాశాలు లేకపోలేవు.
ఇంగ్లండ్ జట్టు విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిన తర్వాత ఆ జట్టు ఆడుతున్న తొలి టీ20 సిరీస్ ఇదే. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, సామ్ కరన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటం వారికి పెద్ద బలం. అలాగే జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులో చేరడం ఇంగ్లండ్ బౌలింగ్ దళానికి మరింత బలం చేకూర్చింది. మొత్తంగా చూస్తే.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ప్లేయింగ్ XI (అంచనా):
భారత్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, తిలక్ వర్మ (VC), శ్రేయస్ అయ్యర్ (C), ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
ఫిల్ సాల్ట్ (WK), విల్ జాక్స్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (C), జాకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్.