Reading Time: 2 minutes
కొండగట్టులో మహాద్బుతం.. బండ నుంచి ఉబికి వస్తున్న నీరు! రోగాలను నయం చేసే గుణం ఉందంటూ..

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం ఎంతో పురాతనమైనది. వేల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఇక్కడ హనుమాన్ కొలువై ఉన్నాడు. గుట్టపైనే స్వామివారు కొలువై ఉన్నారు. అయితే గుట్ట పరిసర ప్రాంతంలో ఎప్పటినుంచో నీటి సమస్య ఉంది. దీంతో కింది నుంచి నీటిని పైకి సరఫరా చేస్తారు. ఇప్పటికీ కొండగట్టులో నీటి సమస్య వెంటాడుతుంది. ఒక వైపు నీటి సమస్య ఉన్నా.. మరోవైపు కొండగట్టులో మెట్ల సమీపంలో అద్భుతం దర్శనమిస్తుంది. ఇక్కడ మండలాల నుంచే నీరు ఉబికి వస్తుంది. ఓ చిన్న బండ నుంచి ఈ నీరు జాలువారుతుంది. గతంలో కొంతమంది వ్యాపారస్తులు ఈ నీటి సమీపంలో ఉన్న బండలు తొలగించారు. దీంతో కొద్ది వరకు ప్రవాహం ఆగిన.. మళ్లీ ఇప్పుడు ఉబికి వస్తుంది. అయితే కొండగట్టులో.. ఎటు చూసినా వనమూలికలు ఉంటాయి. ఈ నీరు కూడా వివిధ చెట్ల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నీళ్లు ఆయుర్వేద మందుగా ఉపయోగపడుతుంది. చాలామంది అనారోగ్యం బారిన పడితే ఇక్కడికి వచ్చి నీళ్లను తాగేవారు. ఆ నీటితో రోగం నయం అవుతుందని వారి నమ్మకం.

ఈ నీటికి ఉన్న మరో విశేషం ఏంటంటే.. ఎప్పుడూ చల్లగా ఉంటాయి. అంతేకాకుండా రుచికరంగా కూడా ఉన్నాయి. కరువు వచ్చినప్పుడు సమీప ప్రాంత రైతులు ఈ నీటిని తీసుకెళ్లి గ్రామంలో పూజలు నిర్వహిస్తారు. అలా చేస్తే వర్షాలు కురుస్తాయని స్థానిక రైతులు చెబుతున్నారు. అయితే ఈ జలబుగ్గ గురించి చాలామందికి తెలియదు. స్థానికులకు మాత్రమే ఇక్కడ జలబుగ్గ ఉందని తెలుసు. అయితే పూర్తిగా బండరాళ్లు ఉండడంతో అక్కడికి వెళ్లడం కష్టంగా మారింది. ప్రభుత్వం చొరవ చూపి ఈ జలబుగ్గను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మహిమాన్వితమైన కొండగట్టులో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత విశిష్టమైన, అద్భుతమైన ప్రదేశం జలబుగ్గ. పూర్వకాలంలో శ్రీ ఆంజనేయ స్వామి గంగాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఘోర తపస్సు చేశారని, ఆ తపస్సుకు మెచ్చిన గంగాదేవి ఈ ప్రదేశంలో ఉద్భవించి నేటికీ నిరంతరంగా ప్రవహిస్తోందని అక్కడి పూర్వీకులు చెబుతూ వచ్చారు. వేసవికాలంలో తీవ్రమైన ఎండలు ఉన్నా, చుట్టుపక్కల భూగర్భ జలాలు తగ్గిపోయినా, ఈ జలధార మాత్రం ఎన్నడూ ఆగదు. కాలక్రమంలో ఈ ప్రవాహానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడినా, వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ పవిత్ర జలధార నిరంతరంగా ప్రవహించడం భక్తులందరూ శ్రీ ఆంజనేయ స్వామి మహిమగా భావిస్తారు. పూర్వం మహర్షులు, మునులు ఈ పవిత్ర జలంలో స్నానం చేసి తపస్సు ఆచరించేవారని కూడా స్థానికంగా విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు శాస్త్రీయ కోణంలో కూడా ఈ జలానికి ప్రత్యేకత ఉంది. దట్టమైన అడవుల గుండా, అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, వేర్లను స్పృశిస్తూ ప్రవహించే ఈ నీరు సహజసిద్ధమైన స్వచ్ఛతను, ఔషధ గుణాలను సంతరించుకుంటుందని భావిస్తారు. ఈ పవిత్ర మార్గం గుండా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ జలాన్ని భక్తితో సేవించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా చెబుతారు.