
Kavitha: కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఝలక్ ఇచ్చింది. ఇటీవల ఆమె స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కొనసాగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పార్టీ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొంటూ, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నిర్దేశిత గడువులో కొత్త పేర్లను సూచించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని కూడా ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు కవితకు అధికారిక లేఖ పంపినట్లు సమాచారం. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై వివాదం తలెత్తడంతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ సూచించింది. అయితే ఈ నిర్ణయంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా రెండు అభ్యంతరాలు మాత్రమే అందాయని.. వాటికి ఇప్పటికే సమాధానాలు పంపినట్లు కవిత వెల్లడించారు. మిగతా అభ్యంతరాల వివరాలు తెలియజేయకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, కొత్త పేర్లను సమర్పించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కవిత.. అవసరమైతే పార్టీ పేరు విషయంలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన పేరును కొనసాగించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రక్షణ సేన పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన కారణంగానే ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి.