
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన “రాఖీ” చిత్రంలోని ఒక కీలక సన్నివేశం గురించి సమీర్ మాట్లాడుతూ.. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ ఒక సుదీర్ఘమైన, కష్టమైన డైలాగ్ను చెప్పాల్సి ఉంటుంది. ఇందులో రైలు మార్గాలు, వివిధ డెస్టినేషన్లకు వెళ్లే రైళ్లు, పండుగల సమయంలో అదనపు రైళ్లు, వాటి ప్రయాణీకుల సంఖ్య, రైల్వే ఉద్యోగుల కేటగిరీల గురించిన ఖచ్చితమైన లెక్కలు చెప్పాలి. దర్శకుడు కృష్ణవంశీ ఈ లెక్కలను ఊరికే రాయకుండా, స్వయంగా పరిశోధించి, వాస్తవాలను తెలుసుకుని స్క్రిప్ట్లో చేర్చారు. ఈ లెక్కలను తప్పులు లేకుండా చెప్పడం ఎంతో కష్టమైన పని అని, ఏ మాత్రం తప్పు జరిగినా ప్రేక్షకులు హీరోగా ఎన్టీఆర్నే ప్రశ్నించే అవకాశం ఉందని సమీర్ పేర్కొన్నారు. చిరంజీవి గారి “ఠాగూర్” సినిమాలో కూడా ఇలాంటి లెంగ్తీ డైలాగ్లు ఉన్నాయని, పెద్ద హీరోలు ఇలాంటి డైలాగ్లు చెప్పేటప్పుడు వాటి వెనుక ఉన్న నాలెడ్జ్తో పర్ఫెక్ట్గా చెప్పాలని సమీర్ అన్నారు.
ఈ ప్రత్యేకమైన సన్నివేశం కాచిగూడ రైల్వే స్టేషన్లో షూట్ చేశారు. ఆ సమయంలో డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేవు. 1000 అడుగుల ఫిల్మ్ క్యాన్లను ముంబై నుండి తెప్పించి, మొత్తం బృందం సిద్ధంగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ ఆ భారీ డైలాగ్ను ఒకే ఒక్క టేక్లో, ఎలాంటి తప్పు లేకుండా, రైల్వే లెక్కలను ఖచ్చితంగా చెబుతూ పూర్తి చేశారని సమీర్ తెలిపారు. ఒక్క నంబర్ కూడా మిస్ అవ్వకుండా, ఒక లైన్ కూడా మర్చిపోకుండా, ఖచ్చితమైన టైమింగ్తో ఎన్టీఆర్ డైలాగ్ చెపుతూ యాక్ట్ చేయడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది. తారక్ నటన చూసి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఆయన క్లాప్స్ కొడుతూనే ఉండి, ఎన్టీఆర్ను “మీ తాత మళ్ళీ పుట్టాడురా” అని ప్రశంసించి, “నా ఆయుష్షు కూడా పోసుకుని బతుకురా” అని దీవించారని సమీర్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, అంకితభావానికి, అలాగే నటన పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. “రాఖీ” సినిమాలోనే ఇలియానాతో కలిసి నటించిన మరో సన్నివేశాన్ని కూడా సమీర్ గుర్తుచేసుకున్నారు. ఆ సన్నివేశంలో కూడా లెంగ్తీ డైలాగ్లు ఉన్నాయని, కృష్ణవంశీ ఆ డైలాగ్స్ వింటూ ఎన్టీఆర్ నటనలో పూర్తిగా లీనమైపోయి, “కట్” చెప్పడం కూడా మర్చిపోయారని తెలిపారు. ఎన్టీఆర్ అడిగిన తర్వాతే కృష్ణవంశీ “సారీ” అని చెప్పి కట్ చేశారని సమీర్ పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి