Reading Time: < 1 minute
Raghav Chadha Appointed Rajya Sabha Petitions Committee Chairman

ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈ కమిటీని పునర్‌వ్యవస్థీకరించి.. 10 మంది సభ్యులను నియమించారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.

రాజ్యసభ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మే 20 నుంచి అమల్లోకి వచ్చేలా ఛైర్మన్ పిటిషన్ల కమిటీని పునర్‌వ్యవస్థీకరించారు. ఈ ప్యానెల్‌కు సభలోని పది మంది సభ్యులను నియమించారు. అందులో రాఘవ్ చద్దా ఛైర్మన్‌గా నియమితులయ్యారని పేర్కొంది.

రాఘవ్ చద్దాతో పాటు హర్ష్ మహాజన్, గులాం అలీ, శంభు శరణ్ పటేల్, మయాంక్‌కుమార్ నాయక్, మస్తాన్ రావ్ యాదవ్ బీదా, జేబీ మాథర్ హిషామ్, సుభాశిష్ ఖుంటియా, ర్వాంగ్రా నార్జారీ, సంతోష్ కుమార్ పిటిషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీంతో పాటు రాజ్యసభ సచివాలయం జారీ చేసిన మరో నోటిఫికేషన్‌లో 2026 మే 20న ‘కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2026పై సంయుక్త కమిటీలో రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామిని సభ్యురాలిగా రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేసినట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా లోక్‌సభ స్పీకర్ మే 21 నుంచి అమల్లోకి వచ్చేలా ‘కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లుపై ఏర్పాటైన సంయుక్త కమిటీకి అరవింద్ గణపత్ సావంత్‌ను నామినేట్ చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రత్యేక నోటిఫికేషన్‌లో తెలిపింది.