Reading Time: 2 minutes
Perni Nani Alleges Ap Government Is Destroying Apsrtc And Blaming Women

Perni Nani: మరోసారి కూటమి సర్కార్‌పై ఫైర్‌ అయ్యారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 24 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో దేశంలో ముందంజలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో పడిందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని పేర్ని నాని మండిపడ్డారు. మహిళలపై నెపం మోపడం దారుణమని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రజల ఆస్తులకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించిన ఆయన, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాలేదంటే అప్పుడే ఆర్టీసీని అమ్మేసేవారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు ఆర్టీసీని తెలుగుదేశం పార్టీ స్వంత ఆస్తిలా ఉపయోగించుకున్నారని విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను చంద్రబాబు తిరస్కరించారని, కానీ 2019లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 54 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించారని గుర్తుచేశారు పేర్ని నాని.. అయితే, చంద్రబాబు హయాంలో ఆర్టీసీ అప్పులు భారీగా పెరిగాయని, జగన్ ప్రభుత్వంలో వాటిని గణనీయంగా తగ్గించామని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ హయాంలో ఉద్యోగుల జీతాలకు ప్రతి సంవత్సరం రూ.3,600 కోట్లు చెల్లించారని, మొత్తం అప్పులను రూ.9 వేల కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు తగ్గించారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, చంద్రబాబు గతంలో ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కూడా కొనలేదని విమర్శించారు. జగన్ హయాంలో 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి తిరుపతిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.

ప్రస్తుతం పీఎంఈబస్ స్కీమ్ పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు నాని.. ఆర్టీసీలోని 10 వేల బస్సులను ప్రైవేటీకరిస్తే పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తున్నామని చెప్పుకుంటూ, ఆ పథకానికి సంబంధించిన నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. మహిళల ఓట్ల కోసం హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిపైనే నిందలు వేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలోని సంపద మొత్తం కొద్దిమందికే పరిమితమవుతోందని, ఆర్టీసీ నియామకాలను కూడా నిలిపివేశారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..