
Trisha Visits Tirumala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న కీలక సమయంలో, ప్రముఖ హీరోయిన్ త్రిషా తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని, వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు త్రిషా.. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో త్రిషా తిరుమలకు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో, ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
టీవీకే పార్టీ విజయం సాధించాలని, శ్రీవారి దీవెనలు పొందేందుకు త్రిషా తిరుమలకు విచ్చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడవనున్న సమయంలో ఈ దర్శనం జరగడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈసారి యువత మరియు నూతన ఓటర్లు కీలక పాత్ర పోషించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయ్కు యువత మద్దతు గణనీయంగా ఉందని అంచనాలు ఉన్నాయి. విజయ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడా లేదా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాడా అన్నది ఇప్పుడు తమిళ ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను ఎలా మలుపుతిప్పుతాయో అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.