Reading Time: 2 minutes
Instant Crispy Dosa Easy Recipe

Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. అదిరిపోయే రుచితో పల్లి కొబ్బరి చట్నీ
దోశల్లోకి పల్లి చట్నీ ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. దీని తయారీకి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర కప్పు పుట్నాల పప్పు, 3-4 పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి.

తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని పల్లీలను లో ఫ్లేమ్‌లో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు , పుట్నాల పప్పు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పల్లీలు, మసాలా మిశ్రమం, చింతపండు, ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే టేస్టీ చట్నీ సిద్ధమవుతుంది.

2. అప్పటికప్పుడే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ
పిండి పులియబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు బియ్యపు పిండి, పావు కప్పు శనగపిండి, ఒక మీడియం సైజు పచ్చి బంగాళదుంప, అర కప్పు పెరుగు (పులిసినది అయితే మరింత రుచి), 5-6 వెల్లుల్లి రెబ్బలు, వేడి నీళ్లలో నానబెట్టిన రెండు ఎండుమిర్చి, అర టీస్పూన్ బేకింగ్ సోడా , ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన ఎండుమిర్చి, బియ్యపు పిండి, శనగపిండి, పచ్చి బంగాళదుంప ముక్కలు, వెల్లుల్లి, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నీళ్లు వేయాలి. వీటన్నింటినీ కలిపి మెత్తటి మిశ్రమంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.

దోశ వేసే పద్ధతి
దోశ పెనం వేడి చేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి క్లీన్ చేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి పిండిని పల్చగా స్ప్రెడ్ చేయాలి. దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత నూనె లేదా నెయ్యి వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే! వేడివేడిగా ఉండే క్రిస్పీ దోశలను పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.