Reading Time: < 1 minute
West Bengal Election 2026 Evm Row Bhabanipur Counting Tensions

West Bengal Elections: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. మే 4 సోమవారం రోజున ఎవరు గెలవబోతున్నారనే దానిపై స్పష్టత రానుంది. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పుతున్నాయి. మళ్లీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గెలుస్తుందా? లేక బీజేపీ దీదీ కంచుకోటను బద్ధలు కొడుతుందా? అని సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్ ఎన్నికల తర్వాత నుంచి వార్తల్లో నిలుస్తోంది. మరోసారి టీఎంసీ కీలక ఆరోపణలు చేసింది. బీజేపీ జెండాలు ఉన్న రెండు కార్లను ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతానికి అనుమతించారని టీఎంసీ ఆరోపించింది. గురువారం రాత్రి మమతా బెనర్జీ నాలుగు గంటల పాటు ధర్నా చేసిన అదే సఖావత్ మెమోరియల్ గర్ల్స్ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది.

Read Also: Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..

ఫలితాలు వెలువడే రోజుకు కొన్ని గంటల ముందు లెక్కింపులో అవకతవకలు, ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతాయని మమతా బెనర్జీ పదే పదే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు నేతలు నిఘా ఉన్నారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న టీఎంసీ కార్యకర్తలు.. బీజేపీ జెండాలు ఉన్న రెండు కార్లు స్ట్రాంగ్ రూమ్‌ల సమీపానికి వెళ్లినట్లు ఆరోపించారు. ఎవరిని అనుమతించని సీఏపీఎఫ్ భద్రతా సిబ్బంది ఈ కార్లను ఎందుకు అనుమతించారని టీఎంసీ ప్రశ్నిస్తోంది.

దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కారను భద్రతా సిబ్బంది, పోలీసులు తనిఖీ చేయగా అందులో అభ్యంతరకరమైనవి ఏమి లేవని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లనిచ్చామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఒక్క కొల్‌కతా మాత్రమే కాకుండా, బెంగాల్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గందరగోళం నెలకొంది.