Reading Time: < 1 minute
Hardik Pandya Criticism Manoj Tiwary Mumbai Indians Playoff Chances Ipl

Manoj Tiwary: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శల విషయంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026లో ముంబై ఎదుర్కొంటున్న వరుస పరాజయాలకు కేవలం హార్దిక్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జట్టులో హార్దిక్ ఒంటరి అయిపోయారని, అతనికి సహచర ఆటగాళ్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ప్రయాణం దాదాపు ముగిసిపోయిందని స్పష్టం చేస్తూ.. “జట్టులో ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలుచుకోవడం ముఖ్యం, కానీ ఇక్కడ హార్దిక్ పక్కన నిలబడే వారే కరువయ్యారు” అని తివారీ పేర్కొన్నారు. కెప్టెన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేని మాట నిజమే అయినా, జట్టులోని ఇతర స్టార్ ఆటగాళ్ల వైఫల్యాన్ని కూడా గుర్తించాలన్నారు. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించకపోవడం, తిలక్ వర్మ ఫామ్ కోల్పోవడం వంటి అంశాలు జట్టును దెబ్బతీశాయని విశ్లేషించారు. రోహిత్ శర్మ, బుమ్రా వంటి అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లు ఉన్నప్పటికీ, మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలో జట్టు తడబడటం నిరాశ కలిగిస్తోందన్నారు.

మరోవైపు, మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ సైతం ముంబై అవకాశాలపై కుండబద్ధలు కొట్టారు. ముంబై ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఇక 99.999% లేనట్టేనని తేల్చి చెప్పారు. పాయింట్ల లెక్కలను వివరిస్తూ.. “ముంబై తన మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా కేవలం 14 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది. కానీ పట్టికలో పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు అప్పుడే 12 నుంచి 13 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఆ జట్లు మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ముంబై కంటే ఎంతో ముందుంటాయి. కాబట్టి ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే తప్ప, వాస్తవంగా అది అసాధ్యం” అని కార్తీక్ వివరించారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఆశలు ఆవిరైపోయాయని ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు.