Reading Time: < 1 minute
Pawan Kalyan Health Update Surgery Chandrababu Visit

CM Chandrababu Naidu: ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స చేయించుకున్న క్రమంలో వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిన్న(శనివారం) హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆయనకు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల స్వాగతం పలికారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ని సీఎం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినా- అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్ర చికిత్స చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉన్నదని, మరో వారం రోజులలో సర్దుకుంటుందని డాక్టర్లు తెలిపారన్నారు.

అదే విధంగా సినిమాలకి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో తగిలిన గాయాలను అప్పట్లో పట్టించుకోలేదని అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని వివరించారు.
భుజం దగ్గరి మజిల్‌కి గాయాలు గత అయిదేళ్ల నుంచి ఉన్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని వైద్యులు ఈ సందర్భంగా వివరించారు. ఆ సమయం నుంచి పవన్ కళ్యాణ్ వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పుడు తిరగబెడుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, శస్త్ర చికిత్స అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులు తెలిపిన సూచనలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు. తగిన విశ్రాంతి తీసుకొని, పూర్తి స్వస్థత పొందాలని ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స అనంతరం శాఖాపరమైన రివ్యూలు చేయడం, ఫైల్స్ పరిశీలించడాన్ని ప్రస్తావిస్తూ- నిర్దేశిత సమయంలోనే ఆ విధులు నిర్వర్తించాలని సూచించారు.