
Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో చారిత్రక మలుపు రాబోతోందా.. దశాబ్దాల పాటు ‘ఎరుపు’ (లెఫ్ట్) జెండా రెపరెపలాడిన ఈ గడ్డపై, ఆ పార్టీలను గద్దె దించి అధికారంలోకి వచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా దీదీగా పిలుచుకునే మమతా బెనర్జీ. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ కోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు ‘కాషాయం’ వైపు మొగ్గు చూపుతోందా.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బెంగాల్ గడ్డపై హోరాహోరీ పోరు సాగినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఈ దఫా అధికార పగ్గాలను చేజిక్కించుకునేది ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిరేపుతుంది.
పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది? మమతా బెనర్జీ హ్యాట్రిక్ తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతోందా? తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు బీజేపీ – తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య ‘నెక్-టు-నెక్’ ఫైట్ ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
బెంగాల్లోని 294 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఉత్కంఠగా మారింది. పలు సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
JVC సర్వే: బీజేపీకి 138-159 స్థానాలు, టీఎంసీకి 131-152 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.
P-MARQ: బీజేపీ 150-175 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, టీఎంసీ 118-138 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది.
Matrize: బీజేపీకి 146-161 (42.5% ఓట్లు), టీఎంసీకి 126-135 (40.8% ఓట్లు) వస్తాయని అంచనా వేసింది.
Poll Diary: బీజేపీకి 142-171, టీఎంసీకి 99-127 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అయితే People’s Pulse మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీకి తిరుగులేదని, టీఎంసీ 177-187 స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, బీజేపీ 95-110 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పింది.
కాషాయ దళం దూకుడు.. డిఫెన్స్లో దీదీ !
2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2021 నాటికి 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు 2026లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్, జంగల్మహల్ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండగా.. ఇదే సమయంలో మమతా బెనర్జీ తన 15 ఏళ్ల పాలనపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేస్తూ, టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
మే 4న భవితవ్యం
2021 ఎన్నికల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో గెలుపోటములు 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతోనే జరిగాయి. ఈసారి కూడా అతి తక్కువ ఓట్ల శాతం అటు ఇటూ అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ మార్పులకు కారణం కావచ్చు వారు చెబుతున్నారు. ఎరుపు జెండాల స్థానంలో పచ్చ తోరణాలు వచ్చి చేరిన బెంగాల్ గడ్డపై, ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతాయా? లేకపోతే మళ్లీ మమతా బెనర్జీ పార్టీ జెండాలే కనబడుతాయా? అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది.