
సాధారణంగా చేసే సాంబార్ కంటే భిన్నంగా, క్యారెట్, వెల్లుల్లి ప్రధాన పదార్థాలుగా చేసుకునే ఈ సాంబార్ అన్నం, ఇడ్లీ లేదా దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ వల్ల తీపిదనం, వెల్లుల్లి వల్ల ఘాటైన రు, ఆరోగ్యం ఈ వంటకం ప్రత్యేకత. దీనిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..
కందిపప్పు: 1 కప్పు
క్యారెట్లు: 2 (ముక్కలుగా కోసినవి)
వెల్లుల్లి రెబ్బలు: 10-12
ఉల్లిపాయ: 1 (పెద్ద ముక్కలు)
టమోటాలు: 2
చింతపండు రసం: చిన్న నిమ్మకాయ సైజు
సాంబార్ పొడి: 2 స్పూన్లు
ఉప్పు, కారం, పసుపు: రుచికి తగినంత
పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ.
తయారీ విధానం: ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఒక పాత్రలో క్యారెట్ ముక్కలు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలను తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. కూరగాయలు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి వేసి బాగా మరిగించాలి. మరుగుతున్న మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి, సాంబార్ చిక్కదనాన్ని బట్టి తగినన్ని నీళ్లు పోసి మరో 5-10 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు మరోక స్టౌవ్పై చిన్న పాన్లో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించి, ఆ పోపును సాంబార్లో కలపాలి.
ఆరోగ్య ప్రయోజనాలు:
వెల్లుల్లి: ఇందులో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యారెట్: క్యారెట్లో విటమిన్-A పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా ఘుమ ఘుమలాడే క్యారెట్-వెల్లుల్లి సాంబార్ సిద్ధం! దీనిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ సారి మీ ఇంట్లో ఈ వెరైటీ సాంబార్ను తప్పక ప్రయత్నించండి!