Reading Time: 2 minutes
Off The Record Over Ycp Krishna District

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా? చాలామంది ఇన్ఛార్జ్‌లు వాళ్లు చెప్పారా…? మనం చేశామా…? అన్నట్టే ఉంటున్నారా? క్షేత్ర స్థాయి యాక్టివిటీ విషయంలో ఏ మాత్రం చొరవ తీసుకోని నేతల లిస్ట్‌ సిద్ధమై పోయిందా? వాళ్ళందర్నీ సెట్‌ చేసేందుకు కూడా స్కెచ్‌ రెడీ అవుతోందా? అసలు కృష్ణా వైసీపీలో జరుగుతున్న పరిణామాలేంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ… నియోజకవర్గ సమన్వయకర్తల పనితీరు ఇప్పుడు పార్టీలోనే చర్చగా మారింది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… 2024 ఎన్నికల్లో ఒక్క చోట కూడా పార్టీ బోణీ కొట్టలేదు. కూటమి పార్టీలు వంద శాతం సీట్లు గెల్చుకోగా…జిల్లాలో వైసీపీ జీరో అయింది. అయితే… అంత ఘోరమైన ఓటమి నుంచి కూడా త్వరగా కోలుకున్న పార్టీ అధిష్టానం రెండేళ్ళుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. కానీ… ఉమ్మడి కృష్ణాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు చాలామంది అధిష్టానం పిలుపునిచ్చిన స్థాయికి తగ్గట్టుగా స్పందించడం లేదన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఈ వ్యవహారం పెద్దల దృష్టికి కూడా వెళ్ళిందట. దీంతో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు, స్థానిక నేతల పనితీరుకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించి స్థానిక పార్టీ నేతలు అనుకున్న స్థాయిలో రెస్పాండ్ అవ్వటం లేదన్నది ఫ్యాన్‌ అధిష్టానం అభిప్రాయం. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్చార్జ్‌లు అనుకున్న స్థాయిలో స్పందిస్తున్నారని, ఎక్కువ చోట్ల సైలెంట్‌ మోడ్‌లో ఉండటంపై ఆరా తీస్తున్నారట. ప్రధానంగా మచిలీపట్నం రాజకీయాలు గతంలో లేనంత హాట్ హాట్ గా మారిపోయాయి. ఇక్కడ నిత్యం మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉంటోంది. మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు పేర్ని. నియోజకవర్గంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే వాటిపై కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ఆందోళనకు దిగుతున్నారు. పామర్రులో ఇసుక, మట్టి దోపిడీ, పేకాట, చెరువు తవ్వకాల మీద మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ ఆందోళన చేయటంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తున్నారు. పెనమలూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారాలపై ఇన్ఛార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి నిత్యం ఆందోళనకు చేయటం ద్వారా ఎమ్మెల్యే కంట్లో నలుసుగా మారారనేది లోకల్ టాక్.

అటు నందిగామలో మొండితోక బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్న విధంగా వ్యవహారం మారింది. ఈ పోరులో మొండి తోక బ్రదర్స్ పై స్థానికంగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. అటు వల్లభనేని వంశీ కూడా ఎన్ని కేసులు పెడుతున్నా గన్నవరంలో ఇళ్ళ పట్టాల సమస్యకు సంబంధించి నేరుగా జిల్లా కలెక్టర్ కలిసి మరి ఫిర్యాదులు చేస్తున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, ఆయన బావమరిది పోసాని కోటేశ్వర రావు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు జోగి రమేష్‌. బూడిద, మైనింగ్,మట్టి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారాయన. వీళ్ళు తప్ప మిగతా ఎవరూ… పార్టీ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని వైసీపీ అధిష్టానం గుర్తించినట్టు తెలిసింది. ప్రధానంగా విజయవాడ నగరాన్ని పరిశీలిస్తే… ఇక్కడ నుంచి గతంలో వెలంపల్లి శ్రీనివాస్‌ మంత్రిగా పని చేశారు. కానీ… అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన పార్టీ ఆదేశించిన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప… నియోజకవర్గంలో పెద్దగా ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహించడం లేదని నాయకులే మాట్లాడుకుంటున్నారు.

విజయవాడ సెంట్రల్ నుంచి ఇన్ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పెద్దగా నోరు విప్పని పరిస్థితి ఉందనేది లోకల్ టాక్. మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బోండా ఉమా సైతం ఆయన మీద పెద్దగా విమర్శలు చేయలేదన్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. ఎన్నికల సమయంలో గద్దె రామ్మోహన్ పై అనేక విమర్శలు చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కావడంతో నియోజకవర్గం కంటే జిల్లా వ్యవహారాలపై ఫోకస్ పెడుతున్నారట. ఇక జగ్గయ్యపేటలో కొత్తగా ఇన్ఛార్జ్‌ పదవి పొందిన నాగేశ్వరరావు, తిరువూరు ఇన్ఛార్జ్‌ స్వామిదాస్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నది అధిష్టానం అభిప్రాయం. వీళ్ళందరి పనితీరుకు సంబంధించి స్థానికంగా ఉన్న నియోజకవర్గాల అబ్జర్వర్ల నుంచి నివేదికలు సేకరించిన అధిష్టానం….సైలెంట్‌గా ఉన్న వాళ్ళని యాక్టివేట్‌ చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.