Reading Time: < 1 minute
India Womens Lose T20i Series 4 1 To South Africa Womens After 23 Run Defeat

India Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 132 పరుగులకే పరిమితమైంది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లారా వోల్వార్డ్ మరోసారి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా ఆడిన ఆమె 56 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఓపెనర్ సునే లూస్ (23) తో కలిసి ఆమె మొదటి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రేణుక సింగ్, శ్రీ చరణి తలో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను మధ్య ఓవర్లలో కట్టడి చేసినప్పటికీ, వోల్వార్డ్ మెరుపులు ఆ జట్టుకు మంచిని స్కోరును అందించాయి.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షెఫాలీ వర్మ (4), జెమిమా రోడ్రిగ్స్ (1) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. అనుష్క శర్మ (17), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, రన్ రేట్ పెంచే క్రమంలో వికెట్లు కోల్పోయారు. మధ్యలో భారతి ఫుల్మాలి 30 బంతుల్లో 40 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఆశలు చిగురింపజేసినా, ఆమె అవుటయ్యాక భారత్ విజయం కష్టతరమైంది.

దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా నోన్కులులేకో మ్లాబా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించింది. నడైన్ డి క్లెర్క్ కూడా రెండు వికెట్లు పడగొట్టి తన వంతు సహకారం అందించింది. ఆఖర్లో రిచా ఘోష్ 15 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 5 టీ20ల సిరీస్ 4-1తో దక్షిణాఫ్రికా వశమైంది.