Reading Time: < 1 minute
Nara Chandrababu Naidu At Andhra University Centenary Visakhapatnam To Become Global City

CM Chandrababu: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి సేవలందించిన వారి పేరు పేరున అభినందనలు తెలియజేసిన ఆయన, తాను రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ.. ఇది కేవలం విద్యాసంస్థ మాత్రమే కాకుండా ఒక గొప్ప బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే స్థాపించబడిన ఈ యూనివర్సిటీ, రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుండటం విశాఖపట్నాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఘట్టమని చెప్పారు.

విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇక్కడ భారీ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుండటం విశాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రావడం విశేషమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించామని గుర్తుచేసిన సీఎం, రాష్ట్రంలో ఉన్న 53 యూనివర్సిటీలకు ఇది దిక్సూచి లాంటిదని అభివర్ణించారు. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజవంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందార్లు, బొబ్బిలి రాజులు వంటి అనేక మంది ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. వారి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు.

తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగ రెడ్డి బలమైన పునాదులు వేసారని, తరువాతి వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీ నుంచి ఎన్నో గొప్ప వ్యక్తులు వెలువడినట్లు పేర్కొన్నారు.