Reading Time: 2 minutes
Ajit Doval Uae Visit Meets Mbz Energy Security Strategic Partnership India Gulf

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూఏఈలో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ స్థిరత్వంపై సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు.

Ajit Doval1

ఇటీవల సౌదీ అరేబియాలో కూడా అజిత్ దోవల్ పర్యటించారు. ఆ పర్యటన ముగిసిన వారం రోజులకే అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అజిత్ దోవల్ ఈ పర్యటన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు నెలలుగా హార్ముజ్ జలసంధిని మూసేశారు. దీంతో ఇందన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేవలం 10 నౌకలు మాత్రమే హార్ముజ్‌ను దాటాయి. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా అజిత్ దోవల్ పర్యటన జరిగినట్లుగా తెలుస్తోంది.

‘‘ఆయన (అజిత్ దోవల్) రాష్ట్రపతి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు. ప్రాంతీయ పరిస్థితి. పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై చర్చించారు.’’ అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

గత రెండు నెలల్లో ప్రధాని మోడీ- యూఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నాయకులతో దాదాపు రెండుసార్లు మాట్లాడారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ దేశాల్లోని తన సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల ప్రారంభంలో తన రెండు దేశాల పర్యటన సందర్భంగా ఎస్. జైశంకర్ యూఏఈ అధ్యక్షుడిని కలిశారు. క్లిష్టమైన ప్రాంతీయ వాతావరణం ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు పటిష్టంగా, పారదర్శకంగా ఉన్నాయని పేర్కొంటూ, భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం భద్రత, వ్యూహాత్మక అంశాలపై ఎమిరేట్స్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు అజిత్ దోవల్ కృషి చేస్తున్నందున.. ఆయన పర్యటన ఒక ముఖ్యమైన దౌత్యపరమైన చొరవగా తెలుస్తోంది.