Reading Time: 2 minutes
Cm Chandrababu Holds Teleconference On Petrol Diesel Shortage Issues Key Orders

Petrol, Diesel Shortage: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంధన కొరత సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ రోజు సాయంత్రానికి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రం నాటికి రిటైల్ పెట్రోల్ బంకులకు చేరుకుంటాయని సమాచారం ఇచ్చారు.

Read Also: Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ఇక, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షణ చేపట్టి ఇంధన సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, అలాగే క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజల్లో అనవసర ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ట్యాంకర్లు చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. సరఫరాలో ఆలస్యం జరిగితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక, బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు, అధికారులు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.