
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇచ్చిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. హిల్టన్ హోటల్లో గ్రాండ్గా విందు జరుగుతుండగా 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ తుపాకులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనతో విందు ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక వెంటనే నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. అతడి దగ్గర నుంచి షాట్గన్, హ్యాండ్గన్, పలు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే విచారణలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు ముందు నిందితుడు కోల్ థామాస్ అలెన్ తన టార్గెట్కు సంబంధించిన విషయాలను ముందుగానే కుటుంబ సభ్యులకు పంపించాడు. ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు సందేశం పంపించాడు. ఇందులో ఆశ్చర్యమేంటంటే.. అమెరికాలో అత్యున్నత పదవిలో ఉన్న ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ను మాత్రం తప్పించాడు. కాష్ పటేల్ మినహా మిగతా అధికారులంతా తన లక్ష్యమని నిందితుడు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లుగా అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘‘ది న్యూయార్క్ పోస్ట్’’ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పుడు కాష్ పటేల్ను ఎందుకు మినహాయించాడన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఇక నిందితుడు ‘‘కోల్.’’ ‘‘కోల్డ్ఫోర్స్’’, ‘‘ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్’’ పేరుతో తన మేనిఫెస్టో లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్లో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించాడు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణ నష్టం తక్కువగా జరగాలని.. అవసరమైతేనే తప్ప సీక్రెట్ సర్వీస్పై దాడి చేస్తానని.. లేదంటే చేయబోనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాల్పుల తర్వాత కాష్ పటేల్ను అక్కడ నుంచి భద్రతా సిబ్బంది తీసుకెళ్లిపోయారు. అనంతరం వైట్హౌస్లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో పాల్గొన్నారు.

ఇక నిందితుడు కాలిఫోర్నియా నుంచి రైలులో వాషింగ్టన్కు వచ్చినట్లుగా గుర్తించారు. అతడు మంచి విద్యావంతుడు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉండి.. టీచర్గా గేమ్ డెవలప్గా కూడా పని చేసినట్లుగా కనిపెట్టారు. అయితే ఇటీవల ఇతగాడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని.. సమాజ సమస్యలపై చర్యలు తీసుకోవాలని మాట్లాడేవాడని కుటుంబ సభ్యులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిపై ఎఫ్బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడిపై ఆయుధాలతో దాడి యత్నం, ఫెడరల్ అధికారిపై దాడి కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.