Reading Time: < 1 minute
Revanth Reddy Ias Transfers Carrot And Stick Policy Telangana

తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీల ద్వారా తన పరిపాలనా శైలిని స్పష్టం చేస్తూ, ‘క్యారెట్ అండ్ స్టిక్’ (Carrot and Stick) విధానాన్ని పక్కాగా అమలు చేశారు. అంటే.. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు (మంచి పోస్టింగ్స్), నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శిక్ష (లూప్ లైన్ పోస్టింగ్స్) అనే సంకేతాన్ని పంపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికారులకు ఒకటే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు: “ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లండి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోండి”. అయితే, కొందరు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలను పట్టించుకోకుండా పాత పద్ధతిలోనే సాగుతున్నారని నివేదికలు అందాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం, ప్రభుత్వం చెప్పినట్లుగా పనితీరు మార్చుకోని అధికారులపై తన పవర్ చూపించారు.

జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించి, సమర్థవంతంగా పనిచేస్తున్న కలెక్టర్లను గుర్తించి వారికి సచివాలయంలో కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు. “పనిచేసే వారు సచివాలయంలో ఉంటే ప్రభుత్వ విధానాల అమలు వేగంగా జరుగుతుంది” అనేది సీఎం ఆలోచన. అదే సమయంలో, పదే పదే హెచ్చరించినా పనితీరు మెరుగుపరుచుకోని వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తూ ‘పనిష్మెంట్’ తరహా పోస్టింగ్స్ ఇచ్చారు.

ఆదివారం నుండి దేశవ్యాప్తంగా జనగణన (Census) ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర నిబంధనల ప్రకారం జనగణన సమయంలో అధికారులను బదిలీ చేయడం వీలుపడదు. దీనిని ముందుగానే పసిగట్టిన రేవంత్ రెడ్డి, ఆ నిబంధన అమలులోకి రావడానికి కేవలం ఒక రోజు ముందే ఈ భారీ మార్పులు పూర్తి చేశారు. తద్వారా రాబోయే ఏడాది కాలం పాటు జిల్లాల్లో పక్కాగా పనిచేసే యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకున్నట్లయింది.

ఈ బదిలీల ద్వారా ముఖ్యమంత్రి అధికారులందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపారు. కేవలం పదవిలో ఉన్నామని కాలక్షేపం చేస్తే కుదరదని, ప్రతి అధికారి జవాబుదారీగా ఉండాలని నిరూపించారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను లైట్ తీసుకునే వారికి లూప్ లైన్ తప్పదని ఈ బదిలీల ద్వారా తేల్చిచెప్పారు.