Reading Time: < 1 minute
Supreme Court Slams Mamata Banerjee Ed Investigation Interference Democracy Threat

Supreme Court: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఈ రోజు (బుధవారం) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు “ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తాయని” అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐ-ప్యాక్ కో-ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు జరుగుతుండగానే ఆమె లోపలికి వెళ్లి కొన్ని కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది.” అని బెంచ్ పేర్కొంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్య అని, దానికి కేంద్రం-రాష్ట్రం మధ్య వివాదం అనే రంగు పులమడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. “రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ లేదా హెచ్.ఎమ్. సీర్వాయి వంటి వారు కూడా ఒక ముఖ్యమంత్రి దర్యాప్తులో అడ్డుతగులుతారని ఊహించి ఉండరు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. ఈడీ ఒక ఏజెన్సీ మాత్రమేనని, దానికి ప్రాథమిక హక్కులను క్లెయిమ్ చేసే అధికారం లేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ తరపున మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రం ఒకేసారి ‘నేరస్థుడు, బాధితుడు’ కాలేదని వాదించారు. దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం, అదీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడ్డుతగలడం చట్టబద్ధమైన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.