Reading Time: 2 minutes
Cm Revanth Reddy Bayyaram Steel Plant Hyderabad Ev Hub

తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక అడుగులు వేశారు. శనివారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి , సహాయ మంత్రి శ్రీనివాస వర్మలతో భేటీ అయిన ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిష్టాత్మక ప్రతిపాదనలను వారి ముందుంచారు. ముఖ్యంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమ స్థాపన ద్వారా ఉక్కు కొరత తీరడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రణాళికలను వివరిస్తూ, పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే సరికొత్త పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పాలని కేంద్ర మంత్రులను కోరారు.

Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

హైదరాబాద్ నగరాన్ని దేశ పారిశ్రామిక ఉత్పత్తికి గుండెకాయలా మార్చేందుకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటోమొబైల్ , రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన వివరించారు. దీనితో పాటు మెషిన్ టూల్స్ , రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ కోసం ఒక ప్రత్యేక పార్క్‌ను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Priyanka Gandhi: ఇది ప్రజాస్వామ్య విజయం.. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టామన్న ప్రియాంకాగాంధీ

ముఖ్యంగా 2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అలాగే, భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ సంస్థలను హైదరాబాద్‌లో నెలకొల్పాలని కోరారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు , కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. సీఎం చేసిన వినూత్న ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.