Reading Time: < 1 minute
Kiren Rijiju Reacts Women Reservation Bill Defeat Congress Criticism

దేశంలోని మహిళలకు కాంగ్రెస్ హాని కలిగించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేసిందని ఆరోపించారు. కచ్చితంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల వ్యతిరేక పార్టీ అని ముద్ర పడిందని.. ఈ కళంకం ఎప్పటికీ తొలగిపోదని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలన్నీ కుట్ర పన్ని మహిళా బిల్లును అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మహిళల హక్కులను నిరాకరించే మనస్తత్వంతో కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. పైగా మహిళలకు హక్కులు కల్పించకుండా వేడుకలు జరుపుకోవడం ఘోరమైన పాపంగా అభివర్ణించారు. మహిళలకు హక్కులు ఇవ్వకుండా తమను తాము విజేతలుగా భావించుకునే పార్టీని ప్రపంచంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది మనందరి బాధ్యత అని పేర్కొ్న్నారు.

ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.