Reading Time: < 1 minute
Satyavedu Mla Adimulams Son Makes Sensational Comments Offers Resignation

MLA Adimulam: తిరుపతి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపేలా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు, నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని, ఆ డబ్బులు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. సత్యవేడు నియోజకవర్గంలో తాము నలభై వేల మెజారిటీతో విజయం సాధించామని సుమన్ తెలిపారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి, ఖర్చు చేసి సీటు గెలుచుకున్నామని పేర్కొన్నారు. తాము పెట్టిన ఖర్చు తిరిగి ఇస్తే చాలని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.

Read Also: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే

తన తండ్రి ఆదిమూలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సుమన్ వెల్లడించారు. పార్టీ తమ కుటుంబాన్ని గౌరవించడం లేదని, గౌరవం లేని చోట పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంకా, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో ఒక అగ్రవర్ణ వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.

అదే సమయంలో సత్యవేడు సీఐపై కూడా సుమన్ ఆరోపణలు చేశారు. రోజూ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని సస్పెండ్ చేయడం లేదని మండిపడ్డారు. తన తండ్రిపై పార్టీ నాయకులే కుట్రలు చేశారని సుమన్ ఆరోపించారు. ఒక దళిత నేతను ఇంతలా వేధించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.