Reading Time: < 1 minute
Mantralayam Road Accident Eight Devotees Killed Near Chilakaladona In Kurnool

Mantralayam Road Accident: కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు, బోలేరో గూడ్స్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు మహిళలు, మూడు సంవత్సరాల బాలిక, డ్రైవర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ

మృతులందరూ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తరికిరీ తాలూకా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.