Reading Time: < 1 minute
Malayalam Actress Sajini Alleges Harassment By Family Over Jubilee Hills Property

ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి సజిని, ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తి కోసం తన అక్క, అక్క భర్త, వారి పిల్లలు కలిసి తనను శారీరకంగా, మానసికగా హింసిస్తున్నారని ఆమె మీడియా ముందు వాపోయారు. సజిని “2001లో నేను సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బుతో మా అమ్మ పేరు మీద జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొన్నాను, అప్పట్లో ఎంతో ప్రేమతో కొన్న ఆ ఇల్లే ఇప్పుడు నా పాలిట శాపంగా మారింది. నెల రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నా కుటుంబ సభ్యుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది” అని తెలిపారు. ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో తనపై దాడులు చేస్తున్నారని సజిని ఆరోపించారు. “మా అక్క, ఆమె పిల్లలు, వారి భర్తలు కూడా నన్ను కొడుతున్నారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి నరకం చూపిస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను పిచ్చిదానిగా ముద్ర వేసి, మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తామని బెదిరిస్తున్నారని, తద్వారా తన ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read :Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..

గతంలో మలయాళంలో బీ గ్రేడ్ సినిమాల్లో నటించిన సజిని, తన కష్టార్జితాన్ని అంతా కుటుంబం కోసమే ఖర్చు చేశానని, కానీ నేడు అదే కుటుంబం తనను రోడ్డున పడేయాలని చూస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తి ముందు రక్తసంబంధాలు, బంధుత్వాలు చిన్నబోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఆస్తి కోసం ఒక నటిని ఇలా వేధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని సజిని కోరుతున్నారు.