Reading Time: < 1 minute
Godavari Pushkaralu 2027 To Be Held Like Kumbh Mela Says Kandula Durgesh

Kandula Durgesh: అమరావతిలోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

బలం, ఆరోగ్యం, విటమిన్లు అన్నీ వీటిలో ఉన్నాయి. ఈ ఫుడ్స్ మిస్ అవ్వకండి!

ఈ మహోత్సవానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లను ఆధునీకరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. భక్తుల కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి గదులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. భారీగా రానున్న భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!

పుష్కరాల ఏర్పాట్లపై త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ పనుల వివరాలను మంత్రి దుర్గేష్ సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచేలా, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.