
Ayatollah Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా మొజ్తబా ఖమేనీ ‘‘అపస్మారక స్థితి’’లో ఉన్నారని ది టైమ్స్ పత్రిక నివేదించింది. ఇరాన్లో పవిత్ర నగరమైన ఖోమ్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఒక దౌత్యపరమైన మెమోను ఉటంకిస్తూ 56 ఏళ్ల మత గురువు తీవ్ర అనారోగ్య సమస్యల్లో ఉన్నట్లు తేలింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించ లేదు. ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడినట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి.
మొజ్తబా ఖమేనీ ఖోమ్లోని తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు గల్ఫ్ దేశాలతో అమెరికా, ఇజ్రాయిల్ పంచుకున్న నిఘా సమాచారంలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోలేని స్థితిలో ఖమేనీ ఉన్నారు. ఆయన ఉన్న ప్రదేశం గురించి అమెరికా, ఇజ్రాయిల్లకు తెలిసిన కొంతకాలంగా దానిని బహిరంగంగా వెల్లడించలేదు.
Read Also: PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే
ఫిబ్రవరి 28లో యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఈ దాడిలోనే మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సీనియర్ ఖమేనీ భౌతికకాయాన్ని ఖోమ్ నగరంలో ఖననం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. యూఎస్, ఇజ్రాయిల్ ఇంటెల్ ప్రకారం.. ఖోమ్లో ఒక పెద్ద సమాధి మందిరాన్ని నిర్మించడానికి అవసరమైన పనుల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే అలీ ఖమేనీ, ఆయన కుటుంబాన్ని ఖననం చేసే అవకాశం ఉంది.
ఈ సమాధి నిర్మాణంలోనే మొజ్తబా ఖమేనీని ఖననం చేయవచ్చని టైమ్స్ నివేదిక పేర్కొంది. దీనిని బట్టి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పరిస్థితి కూడా విషమంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నివేదికపై వాషింగ్టన్ కానీ, టెహ్రాన్ కానీ అధికార ప్రకటన చేయలేదు. యూఎస్, ఇజ్రాయిల్ దాడుల్లో మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది ఈ దాడిలో అతడి తండ్రి, తల్లి, భార్య జహ్రా హద్దాద్-అడెల్, అతని కుమారుల్లో ఒకరు మరణించారు. ఖమేనీ తీవ్రగాయాలతో కోమాలో ఉన్నారని చాలా నివేదికలు చెప్పాయి.