Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్న తమకు మీరంతా అండగా నిలబడ్డారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్టినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని గెలిపించారని, 2023 తమ దగ్గర అధికారం లేదు.. అక్రమ సంపాదన లేదు అని.. మాటలతోనో, మూటలతోనో అయితే 2023 లో తాము గెలిపించేవాళ్లం కాదు అని తెలియజేశారు. గల్లీ నుంచి ఢిల్లీవరకు మీ హక్కుల కోసం పోరాటం చేశామని, వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారని, మీ పోరాటంలో అనేకమంది ప్రాణాలు పోయాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి తాను ఈ సమస్యను చూస్తూనే ఉన్నానని మన న్యాయమైన హక్కులను సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే.. చూపించి ఉండకపోవచ్చునని, తాను బలహీనుల పక్కనే నిలబడి కొట్లాడానని, మీ న్యాయమైన హక్కులను సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ఎవరు ఏమనుకున్నా కర్ణుడిలా మాదిగల విషయంలో మిత్ర ధర్మాన్ని పాటించాని అన్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఉన్నా సమస్యకు పరిష్కారం చూపించానని, మాదిగ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎస్సి వర్గీకరణ చేసి దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డాం అని.. మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యల పరిష్కారం పెద్ద సమస్యే కాదు అని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చాయా అంటే తనకు తెలీదు అని.. పేదలకు పంచడానికి భూములు లేవు అని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, అర్హులందరికీ పథకాలు అందేలా చూడాల్సింది అధికారులేనని రేవంత్ స్పష్టం చేశారు.