
భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ చారిత్రాత్మక మార్గమధ్యంలో నిలిచింది. ఒకప్పుడు దేశనిర్మాణం సామాజిక పురోగతికి మేధో శక్తిగా భావించబడిన ఈ వ్యవస్థ ఇప్పుడు నిర్మాణాత్మకంగా, నైతికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థల సంఖ్య వేగంగా పెరిగింది, నాణ్యత, స్వయం ప్రతిపత్తి, విద్యా లక్ష్యం పెరగలేదు. ఫలితంగా ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. డిగ్రీలు ఎక్కువ, కానీ నైపుణ్యాలు తక్కువ; క్యాంపస్లు ఎక్కువ, కానీ పరిశోధన బలహీనంగా; ప్రవేశాలు ఎక్కువ, కానీ నమ్మకం తగ్గుతూ ఉంది. విద్య ఎప్పుడూ అభివృద్ధికి పునాది, ముఖ్యంగా ఆలస్యంగా పారిశ్రామీకరణ చెందుతున్న సమాజాలకు. ప్రాథమిక విద్య అక్షరాస్యతను, పౌరచైతన్యాన్ని పెంపొందిస్తే, ఉన్నత విద్య ఆవిష్కరణ, పరిశోధన, నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుంది. గత అర్ధ శతాబ్దంలో తమ ఆర్థిక వ్యవస్థలను మార్చుకున్న దేశాలు మానవ వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. భారతదేశం, విశేష జనాభా ప్రయోజనం ఉన్నప్పటికీ, నిరంతరంగా అది చేయలేకపోయింది. దాని ప్రభావాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల విద్యార్థుల సంక్షేమంపై న్యాయస్థానాల పరిశీలనలు క్యాంపస్లలో ఉన్న ఒత్తిడిని దేశవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చాయి. ఆర్థిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, విద్యా ఆందోళన, సంస్థాగత మద్దతు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. పరిపాలన బోధనా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కోర్టులు హైలైట్ చేశాయి. ఎందుకంటే పాలనలో ఉన్న ఖాళీలు నేరుగా విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అనుమతించిన బోధన పోస్టులలో సగానికి సమీపం ఖాళీగా ఉంది. దీని వల్ల బోధన నాణ్యత, పరిశోధన సంస్కృతి బలహీనపడుతోంది. ఈ పతనం ముఖ్యంగా పాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారిచూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి, భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం ప్రతిపత్తి సంక్షోభం విశ్వసనీయత సంక్షోభంగా మారింది.
జాతీయ స్థాయిలోకూడా ఉన్నత విద్యా వ్యవస్థలో అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది సిద్ధత లేకుండా విస్తరణ. గత రెండు దశాబ్దాల్లో ప్రైవేట్ సంస్థలు వేగంగా పెరిగి డిమాండ్- సప్లై అంతరాన్ని పూరించాయి. కానీ అనేక సంస్థలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే పని చేస్తున్నాయి. ప్రవేశాలు పెరిగినా ప్రభుత్వ నిధులు పెరగలేదు, మౌలిక వసతులు వెనుకబడ్డాయి, అధ్యాపకుల కొరత తీవ్రమే. ప్రయోగశాలలు పాతబడిపోయాయి, గ్రంథాలయాలు సరిపడా లేవు, తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. ఈ పరిమాణాత్మక పెరుగుదల ఉద్యోగ అవకాశాల్లో తీవ్రమైన అంతరాన్ని సృష్టించింది. విద్యార్థులు ప్రాయోగిక నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం, సమస్య పరిష్కార సామర్థ్యం లేకుండా పట్టభద్రులవుతున్నారు. అనేక కోర్సుల సిలబస్ దశాబ్దాలుగా మారలేదు, సిద్ధాంతానికి ప్రాధాన్యం, అన్వయానికి తక్కువ ప్రాధాన్యత. విద్యా సంస్థలు -పరిశ్రమల మధ్య బలహీన సంబంధం విద్యార్థులను వాస్తవ ప్రపంచం నుండి దూరం చేస్తుంది. ఫలితంగా చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరుగుతుండగా, సంస్థలు నైపుణ్యాల కొరతను చెబుతున్నాయి. ఇది వ్యవస్థ వైఫల్యానికి సంకేతం.
ఈ క్షీణత ప్రధాన కారణం అధ్యాపక సంక్షోభం. అధిక పని భారం, కాంట్రాక్టు ఉద్యోగాలు, తక్కువ పరిశోధన మద్దతు, పరిపాలన ఒత్తిడి వల్ల ఉపాధ్యాయుల్లో విసుగు పెరిగింది. ఆసక్తి లేని ఉపాధ్యాయులు ఆసక్తిగల విద్యార్థులు సృష్టించలేడు. మార్గదర్శకత తగ్గడంతో హాజరు తగ్గడం, విద్యా ఫలితాలు పడిపోవడం, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. ఇది దేశ ఉత్పాదకతను దెబ్బతీసే ప్రమాదం. ప్రతిభావంతులైన అధ్యాపకులు విదేశాలకు లేదా కార్పొరేట్ రంగాలకు వెళ్లడం సంస్థల సామర్థ్యాన్ని మరింత బలహీనపరుస్తోంది. అసమానత కూడా సమస్యను పెంచుతోంది. ఉన్నత నాణ్యత విద్యకు ప్రాప్యత ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా, ఆర్థిక స్థాయిల వారీగా సమానంగా లేదు. ప్రముఖ సంస్థలు పెద్ద నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. గ్రామీణ, చిన్న పట్టణాల విద్యార్థుల వలస వెళ్లాల్సి వస్తోంది లేదా తక్కువ వసతులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థిక అడ్డంకులు, మద్దతు వ్యవస్థల లేమి వల్ల అట్టడుగు వర్గాల అవకాశాలు తగ్గుతున్నాయి. సమాన అవకాశాలు ఇవ్వాల్సిన ఉన్నత విద్య అసమానతను పునరుత్పత్తి చేస్తుంది.
పరిశోధన రంగం కూడా బలహీనంగా ఉంది. ప్రపంచ పోటీ దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రభావవంతమైన పరిశోధన ప్రచురణలు తక్కువగా ఉత్పత్తి చేస్తోంది; పదోన్నతులు తరచుగా సీనియారిటీ ఆధారంగా జరుగుతున్నాయి. సృజనాత్మకతకు తక్కువ ప్రాధాన్యం. తక్కువ నిధులు, అధిక నియంత్రణ, పరిమిత సహకారం సృజనాత్మకతను నిరుత్సాహపరుస్తుంది. బలమైన పరిశోధన సంస్కృతి లేకుండా విశ్వవిద్యాలయాలు సాంకేతిక అభివృద్ధికి లేదా విధాన రూపకల్పనకు పెద్దగా తోడ్పడవు. పాలసీ మార్పులు, గ్రేడ్ చేసిన స్వయం ప్రతిపత్తి, పరిశోధన ఫెలోషిప్లు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్లు వంటి ప్రభుత్వ చర్యలు సమస్యను గుర్తించిన సంకేతాలే. అయితే స్థిరమైన పెట్టుబడి, పారదర్శక పాలన, సంస్థల స్వాతంత్య్రం లేకుండా సంస్కరణలు అసంపూర్తిగానే ఉంటాయి. స్వయం ప్రతిపత్తి అంటే కేవలం పరిపాలనా స్వేచ్ఛ కాదు; ఉన్నత విద్య దేశ కార్మిక శక్తి, ప్రజాస్వామ్య చైతన్యం, శాస్త్రీయ సామర్థ్యాన్ని నిర్మిస్తుంది. విశ్వవిద్యాలయాలు బలహీనపడితే ఆర్థిక వృద్ధి మందగిస్తుంది.
సామాజిక పురోగతి తగ్గుతుంది. మేధో జీవితం పేదరికంలో పడుతుంది. ప్రపంచ నాయకత్వం కోరుకునే దేశం బలహీన విద్యా పునాదులపై నిలవలేను. అందువల్ల భారతదేశానికి స్పష్టమైన మార్పు అవసరం. ప్రభుత్వ పెట్టుబడులు పెంపు, ప్రతిభాపరమైన నియామకాలు, సిలబస్ ఆధునీకరణ, పరిశ్రమ భాగస్వామ్యం, ముఖ్యంగా అకాడెమిక్ స్వేచ్ఛ రక్షణ. విశ్వవిద్యాలయాలను పరిపాలనా విభాగాలుగా లేదా రాజకీయ వేదికలుగా కాకుండా జ్ఞానం, సామాజిక పురోగతికి అంకితమైన ప్రజా నమ్మక సంస్థలుగా చూడాలి. ఉన్నత విద్య సంక్షోభం కేవలం విద్య సమస్య కాదు; అభివృద్ధి సవాలు. దీనిని అత్యవసరంగా, నిష్ఠతో పరిష్కరిస్తే భారత జనాభా ప్రయోజనం జ్ఞాన ప్రయోజనంగా మారింది. నిర్లక్ష్యం చేస్తే డిగ్రీలు ఉన్నా కానీ సామర్థ్యం లేని తరాలు తయారవుతాయి. ఈ ఎంపికే భారత భవిష్యత్తుకు ఉన్నత విద్య ఇంజిన్గా మారుతుందా లేక అడ్డంకిగా మిగిలిపోతుందా అనేది నిర్ణయిస్తుంది.
– డా. ముచ్చకోట సురేష్ బాబు