
Telangana SIR : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ , క్లెయిమ్ల పరిశీలన ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం , కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులపై అధికారులు పాటించాల్సిన స్పష్టమైన మార్గదర్శకాలను ఆయన వెల్లడించారు.
ఓటర్లకు ఉపశమనం.. స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు
ప్రత్యేక ప్రచార (SIR) ప్రక్రియలో భాగంగా వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా అధికారుల ముందుకు హాజరు కావాల్సిన అవసరం లేదని సీఈఓ తెలిపారు. సదరు ఓటరు కుటుంబంలోని ఏదేని ఒక వయోజన కుటుంబ సభ్యుడు సంబంధిత ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై వివరాలు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఓటరు తరఫున కుటుంబ సభ్యులు సమర్పించిన అవసరమైన పత్రాలు, సమాచారాన్ని స్వీకరించి, ఆ నోటీసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన సూచనలతో ఉత్తర్వులు పంపడం జరిగింది.
ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , డిక్లేరేషన్ ఫారం నిబంధనలు
నూతనంగా ఓటరు హక్కు కోసం దాఖలయ్యే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన , క్లెయిమ్ల పరిష్కారంలోనూ నూతన నిబంధనలను పొందుపరిచారు. అర్హత కలిగిన ఓటరుగా గుర్తించడానికి 1 అక్టోబర్ 2026 ను ప్రధాన అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఫారం-6 దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో అందే దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో సమర్పించే ప్రతి ఫారం-6 దరఖాస్తుతో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అంతా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.