
PM Modi Inaugurates Semicon India 2026: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెమీకాన్ ఇండియా 2026ను ప్రారంభించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఈ గ్లోబల్ ఈవెంట్ జరగనుంది. 52 దేశాలకు చెందిన 600కు పైగా కంపెనీలు, స్టార్టప్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. సెమీకండక్టర్ రంగానికి చెందిన 400 మందికి పైగా ఎగ్జిక్యూటివ్లు, స్పీకర్లు, వేలాది మంది సందర్శకులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సెమీకాన్ ఇండియా థీమ్గా ‘Silicon to Systems: Building the Ecosystem’ను నిర్ణయించారు. సిలికాన్ నుంచి పూర్తిస్థాయి వ్యవస్థల వరకు సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
భారత్పై ప్రపంచ దేశాల నమ్మకం పెరుగుతోంది: మోడీ
సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో విశ్వకర్మను సృష్టి, నిర్మాణానికి దేవుడిగా పూజిస్తారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం దేశ ప్రజలంతా కృషి చేస్తున్నారని మోడీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలోనే ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం కూడా పెరుగుతోందని చెప్పారు. గత కొన్ని రోజులుగా భారత్లో చోటుచేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో చర్చలు జరుగుతున్నాయని, దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని తెలిపారు.
పాలసీల నుంచి కమర్షియల్ చిప్ తయారీ వరకు
సెమీకాన్ ఇండియా కార్యక్రమం తొలిసారిగా 2021లో ప్రారంభమైంది. అప్పట్లో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విధానాలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలు, పైలట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. గత ఏడాది పైలట్ ప్రాజెక్టులు, చిప్ నమూనాలపై చర్చించగా, ఈ ఏడాది కమర్షియల్ చిప్ తయారీపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రధాని తెలిపారు. గుజరాత్లోని సూరత్కు చెందిన సూచి సెమీకాన్, పంజాబ్లోని మొహాలీకి చెందిన CDIL సంస్థలను ప్రధాని అభినందించారు. భారత సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషి చేస్తున్న పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వాములకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
సెమీకండక్టర్ మిషన్ 2.0కు భారీ కేటాయింపులు
భారత్ తన సెమీకండక్టర్ మిషన్ రెండో దశను ప్రారంభించింది. మొదటి దశ పరిమాణం 8 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, రెండో దశకు ప్రభుత్వం 13.5 బిలియన్ డాలర్లను నిర్ణయించినట్లు మోడీ చెప్పారు. భారతీయ చిప్ డిజైన్ కంపెనీలు, స్టార్టప్లతో పాటు ప్రపంచంలోని ఇతర సంస్థలు కూడా భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టుల విజయానికి అవసరమైన విధానాలు, ఫ్రేమ్వర్క్లు, ఇతర చర్యలను ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు.
సరఫరా గొలుసు బలోపేతంపై ప్రత్యేక దృష్టి
సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి సరఫరా గొలుసు కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ఈ రంగంలో సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు భారత్లో అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. చిప్ తయారీకి అవసరమైన రసాయనాలు, ముడి పదార్థాల కోసం గ్లోబల్ కంపెనీలకు భారత్లో అనుకూలమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతోందని చెప్పారు. భవిష్యత్ డిమాండ్కు అనుగుణంగా అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. మొదటి దశలో 12 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతులు లభించాయని, తదుపరి దశలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. దేశంలో ఇంజినీరింగ్ ప్రతిభకు పెద్ద సంఖ్యలో మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఏఐ అభివృద్ధితో పెరుగుతున్న చిప్ డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్ రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మోడీ తెలిపారు. ట్రాన్సిస్టర్ల పరిమాణం తగ్గుతున్న కొద్దీ టెక్నాలజీ వేగం పెరుగుతోందని అన్నారు. గత రెండేళ్లలో సెమీకండక్టర్ మార్కెట్ వృద్ధి 20 శాతానికి మించి ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక కంపెనీలు ఏఐపై దృష్టి సారిస్తున్నాయని, మెమరీ, ప్రాసెసర్ ఇంటిగ్రేషన్కు సంబంధించిన సవాళ్లపై పరిశ్రమలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
ఏఐ ఆధారిత వ్యవస్థలకు భారీ సంఖ్యలో మైక్రోప్రాసెసర్లు అవసరమవుతాయి. వీటి వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ అవసరం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ పవర్ సెక్టార్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రధాని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాల్లో దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగిందని చెప్పారు. అణు విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రసార వ్యవస్థల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని వివరించారు. పవర్ సెక్టార్లో పెట్టుబడులు సెమీకండక్టర్ పరిశ్రమతో పాటు మొత్తం పారిశ్రామిక ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడంలో సహాయపడతాయని అన్నారు.
రెండు కొత్త కమర్షియల్ చిప్ తయారీ యూనిట్ల ప్రారంభం
సెమీకాన్ ఇండియా 2026 వేదికగా సూరత్కు చెందిన సూచి సెమీకాన్, పంజాబ్లోని CDIL సంస్థలకు చెందిన రెండు కొత్త కమర్షియల్ చిప్ తయారీ యూనిట్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ యూనిట్లు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), గృహోపకరణాల కోసం అవసరమైన చిప్ల తయారీపై దృష్టి సారించనున్నట్లు కార్యక్రమంలో వెల్లడించారు. ఈ రెండు యూనిట్ల ప్రారంభంతో భారత్లో కమర్షియల్ చిప్ తయారీ సంస్థల సంఖ్య ఐదుకు చేరినట్లు సమాచారం. దేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ హబ్గా అభివృద్ధి చేసే దిశలో ఇది కీలక అడుగుగా పేర్కొంటున్నారు.
సెమీకాన్ 2.0కు ఆరు మెయిన్ పిల్లర్స్
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ప్రసంగంలో సెమీకాన్ 2.0 ఆరు మెయిన్ పిల్లర్స్ పై ఆధారపడి ఉందని తెలిపారు.
1. చిప్ తయారీ
సెమీకండక్టర్ చిప్ల తయారీ సామర్థ్యం
2. మెషినరీ
చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు
3. డిస్ప్లే, మెమరీ కాంపోనెంట్లు
ఎలక్ట్రానిక్స్లో కీలక భాగాలు
4. అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్
చిప్ ప్యాకేజింగ్లో ఆధునిక సాంకేతికత
5. పరిశోధన, అభివృద్ధి
R&D, కొత్త టెక్నాలజీల అభివృద్ధి
6. టాలెంట్
నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీ
ఒడిశాలో అడ్వాన్స్డ్ 3D ప్యాకేజింగ్ పనులు ప్రారంభించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకాన్ ఇండియా 2026లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకటనలు వచ్చినట్లు వెల్లడించారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన 1 లక్ష మంది నైపుణ్యవంతులైన టాలెంట్ను సిద్ధం చేయడంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
మొత్తం సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను ఒకే వేదికపై ప్రదర్శన
సెమీకాన్ ఇండియా 2026లో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన పూర్తి విలువ గొలుసును ప్రదర్శిస్తున్నారు. చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ముడి పదార్థాలు, సరఫరా గొలుసు వరకు వివిధ దశలను ఇందులో చూపిస్తున్నారు. భారత్తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన కంపెనీలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, స్టార్టప్లు పాల్గొంటున్నారు. దేశంలోని 650కు పైగా విద్యా సంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు వర్చువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు.
India’s semiconductor ecosystem is expanding rapidly. It is opening new opportunities for innovation, investment and growth. Addressing SEMICON India 2026 in Delhi. https://t.co/a7A2Rs89DI
— Narendra Modi (@narendramodi) September 17, 2026