Reading Time: < 1 minute
Ind Vs Afg 3rd T20 Vaibhav Sooryavanshi Father Says My Son Is Ready To Play

Vaibhav Sooryavanshi Father Sanjeev Comments: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడలేదు. తొలి రెండు టీ20ల్లోనూ ఓపెనర్‌గా సంజు శాంసన్‌కే అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సంజు.. రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. దాంతో వైభవ్‌కు అవకాశం ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే మూడో టీ20లో వైభవ్‌ను ఆడించే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రెండో టీ20 అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడో టీ20లో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం అని చెప్పాడు. సర్పంచ్ సాబ్ వ్యాఖ్యలు చూస్తే మూడో మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆడడం ఖాయం. అయితే సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మల్లో ఒకరిపై వేటు పడనుంది. ఇద్దరిలో ఎవరు బెంచ్‌లో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్‌ను మీ కుమారుడు తుది జట్టులో లేకపోవడంపై ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఆయన సింపుల్‌గా స్పందించారు. ‘జట్టుకు అవసరం ఉన్నపుడు తప్పక ఆడతాడు. బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు’ అని సంజీవ్ చెప్పారు. వైభవ్ అవకాశం కోసం సిద్ధంగా ఉన్నాడని సంజీవ్‌ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్ 160 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయగా.. అభిషేక్ 19 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో భారత్ 14.5 ఓవర్లలోనే 163/3 స్కోరు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజు భారీ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావడంతో.. అతనికి, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మధ్య ఓపెనింగ్ స్థానంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడినట్టయింది. అయితే మూడో టీ20లో వైభవ్‌కు అవకాశం ఇస్తే.. సంజు, అభిషేక్‌లలో ఎవరిని పక్కన పెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.