Reading Time: < 1 minute
Mohsin Naqvi: ఏసీసీ పీఠం నుంచి నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. కుర్చీ కదలడం ఖాయం

Mohsin Naqvi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన పదవీకాలంలో భారత క్రికెట్ జట్టుతో నడుస్తున్న వివాదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆసియా కప్ గెలిచిన భారత పురుషుల జట్టు.. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళా జట్టు కూడా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. వరుసగా ఇలా జరగడం పట్ల బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది.

త్వరలో ముగియనున్న పదవీకాలం

ఏసీసీ చైర్మన్ పదవి రెండేళ్ల రొటేషన్ పద్ధతిలో మారుతుంటుంది. 2025 ఏప్రిల్‌లో ఈ బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. అంటే ఆయనకు కేవలం 7 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. నిబంధనల ప్రకారం సభ్య దేశాల మద్దతు ఉంటే ఈ పదవీకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. గతంలో జై షా ఏసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం (సుమారు 4 సంవత్సరాలు) సేవలందించిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ మద్దతు దక్కడం కష్టమేనా?

మొహ్సిన్ నఖ్వీ పదవీకాలాన్ని పొడిగించాలంటే ఇతర సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్‌లో కీలక శక్తిగా ఉన్న బీసీసీఐ మద్దతు లేకుండా నఖ్వీకి ఎక్స్‌టెన్షన్ లభించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. భారత జట్లతో ఆయన వ్యవహరించిన తీరు, ట్రోఫీ ప్రెజెంటేషన్ వివాదాల నేపథ్యంలో బీసీసీఐ ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఇతర సభ్య దేశాలు కూడా ఆయన పనితీరు పట్ల గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే నఖ్వీకి ఏసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..