
పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం.. కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నిన్న సాయంత్రం శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించాడు. కాసేపటికే వారంతా స్పృహ కోల్పోయారు.
వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే తండ్రి శ్రీనివాసరావు, కుమార్తె లాస్య కన్నుమూశారు. కుమారుడు నిఖిల్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం నిఖిల్ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీనివాసరావు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారా? ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.