
హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని సీఎం చెప్పారు. అందుకే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణకు ఆదేశిస్తున్నానని, 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులను కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి 440 ఎకరాల భూమి ఉందని.. కేసీఆర్ కుటుంబం పేరు మీద ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయో.. సీఎం రేవంత్ రెడ్డి సర్వే నంబర్లతో సహా చదివి వినిపించారు.
27 ఎకరాలు ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉందని.. కేటీఆర్ కుటుంబంలో అయితే నలుగురి పేరుతో 123 ఎకరాల భూములున్నాయని సీఎం రేవంత్ చెప్పారు.
కేటీఆర్ పేరు మీద నలభై తొమ్మిదిన్నర ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరు మీద పదిహేడున్నర ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, హిమాన్ష్ పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉందని.. ఉద్యమాన్ని, ధరణిని అడ్డం పెట్టుకుని దోపిడి చేశారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ : 22Aలో భూమిని పెట్టటానికి నిబంధనలు ఇవే
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఫామ్ హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతానని సీఎం ప్రకటించారు.
* మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్పై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
* కేసీఆర్కు తక్షణమే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సీఎం ఆదేశం
* 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫాం హౌస్ పరిధిలో ఉందని చెప్పిన సీఎం
* అధికారుల విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే ఆ భూమి పేదలకు పంచుతాం
* 30 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు
* సకాలంలో విచారణ పూర్తి చేయకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన సీఎం