Reading Time: 2 minutes
Aadhaar Card: ఆధార్ లేకపోయినా సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఉత్తర్వులు వచ్చేశాయ్..

ఏపీలోని ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ ప్రయోజనాలు, సబ్సిడీలు పొందేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఆధార్ లేదనే కారణంతో సేవలు నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల నిర్వహకులను కూడా ఆదేశించింది. ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమేనని, తప్పనిసరి కాదని తెలిపింది. స్వచ్చంధంగా ఆధార్ ఇస్తేనే తీసుకోవాలని, లేకపోతే ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రాలను వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఉపయోగించుకోవాలని సూచించింది. ఆధార్ లేదనే కారణంతో ప్రభుత్వ సేవలు అందించకపోవడం లాంటివి చేయకూడదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆధార్ ఇవ్వలేని సందర్భంలో ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు ధృవీకరణ పత్రాల గురించి దరఖాస్తుదారుడికి తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు 246 సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఆధార్ లేదనే కారణంతో ఈ సేవలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ ఆథెంటికేషన్ ఆప్షనల్ మాత్రమేనని, ఈకేవైసీ కోసం తీసుకునే సమయంలో కారణాలు, వివరాల భద్రతపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. స్వచ్చంధ ప్రాతిపాదికన మాత్రమే ప్రభుత్వ సేవల కోసం ఆధార్ తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలతో పాటు దివ్యాంగుల సర్టిఫికేట్ల జారీలోనూ ఇదే విధానం అమలవుతుందని స్పష్టం చేసింది. ఇక గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ప్రభుత్వ సేవలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ ధృవీకరణ విఫలమైనా ప్రజలకు సేవలు అందించాలని సూచించింది. 246 రకాల ప్రభుత్వ సేవల విషయంలో దరఖాస్తుదారుల గుర్తింపును ధృవీకరించేందుకు ఎస్/నో ఆధార్ అధెంటికేషన్, ఈకేవైసీని స్వచ్చంధంగా ఉపయోగించుకోవచ్చు. ఆధార్ తీసుకుంటే దరఖాస్తుదారుడి సమ్మతిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆధార్ తీసుకుంటే ఎందుకు తీసుకున్నారనే కారణాలతో పాటు ఎలా ఉపయోగిస్తారు.. ఎలా భద్రపరుస్తారు అనే వివరాలు తెలియజేయాలి. ఇక ఎన్‌క్రిప్టెడ్ ఆధార్ డేటా వాల్ట్‌లో దానిని యూఐడీఏఐ నిబంధనల ప్రకారం భద్రపర్చాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు గ్రామ, వార్డు సచివాలయ అధికారులతో పాటు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సేవలు అందించాలని సూచించింది. ఒకవేళ నిరాకరించినట్లు తమ దృష్టికి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ సేవలకు ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమేనని గుర్తించుకోవాలని సూచించింది. ఆధార్ తప్పనిసరి అని భావించవద్దని తెలిపింది. ఆధార్ ఉంటేనే సేవలు అందిస్తామనేది కరెక్ట్ కాదని పేర్కొంది.