
రైడ్ బుక్ చేయడానికి ముందే అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్లను చూపించి.. రైడ్ త్వరగా బుక్ అవ్వాలంటే టిప్ యాడ్ చేయాలని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ విధానం అన్యాయంగా ఉందని, అందువల్ల దానిని తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించిందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం వెల్లడించారు.
డ్రైవర్లకు ముందస్తు టిప్పింగ్తో సహా, పలు అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడినందుకు రాపిడోపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రూ. 10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజే నిధి ఖరే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ప్రస్తుతం అధికార యంత్రాంగం ఉబెర్ మరియు ఓలా వ్యాపార పద్ధతులను పరిశీలిస్తోందని ఆమె తెలిపారు. ట్యాక్సీ రైడ్ అగ్రిగేటర్లకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వారిపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు చాలా ఫిర్యాదులు అందాయని ఖరే తెలిపారు. రైడ్ తీసుకునే ముందే అడ్వాన్స్ టిప్ తీసుకునే పద్ధతి ఉందని వినియోగదారులు ఆరోపిస్తున్నారని ఆమె చెప్పారు.
►ALSO READ | షాకివ్వబోతున్న పెట్రోల్ బంకులు.. రూ.2 వేలకు మించి పెట్రోల్, డీజిల్ కావాలంటే డబ్బులివ్వాల్సిందే.. UPI పేమెంట్లకు నో !
టిప్ చెల్లించకపోతే రైడ్ ఇవ్వమని వినియోగదారులను ప్రలోభపెడుతున్నారని.. తద్వారా వినియోగదారుల మానసిక ఒత్తిడికి క్యాబ్ అగ్రిగేటర్లు కారణం అవుతున్నారని ఆమె వివరించారు. టిప్ ఇవ్వడం పూర్తిగా స్వచ్ఛందమని, ప్రయాణం చేసిన తర్వాత ఆ విషయాన్ని వినియోగదారుల విచక్షణకే వదిలివేయాలని ఖరే స్పష్టం చేశారు. ఉబెర్, ఓలా విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఆమె చెప్పారు.