Reading Time: 2 minutes
Vijay Shankar On Lpl 2026 Social Media Trolling I Was Scared

Vijay Shankar On Social Media Trolling: భారత వెటరన్ క్రికెటర్ విజయ్ శంకర్ సోషల్ మీడియా ట్రోలింగ్ తనను ఎంతగా ప్రభావితం చేసిందో తాజాగా వెల్లడించాడు. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను పంచుకున్నాడు. ముఖ్యంగా 2026 లంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో జరిగిన ఓ మ్యాచ్ తర్వాత వచ్చిన ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధించిందని చెప్పాడు. ఇంకో టోర్నీలో ఫాన్స్ నా గురించి ఏమనుకుంటారు?, నన్ను ఎలా చూస్తారు? అని భయపడిపోయా అని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఎల్‌పీఎల్‌లో ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయ్ శంకర్ జట్టు విజయానికి 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయని అతడు చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ పరిణామంపై స్పందించిన విజయ్.. ‘ఇలాంటి పరిస్థితులు ఆటగాళ్ల కెరీర్‌లను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది నా కెరీర్‌పై చాలా ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్‌లో నేను బ్యాటింగ్‌కు వచ్చిన సమయానికి మ్యాచ్ దాదాపు మా నుంచి చేజారిపోయింది. చివరి ఓవర్‌లో 22 పరుగులు అవసరమయ్యాయి. నాతో పాటు టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. వారికి స్ట్రైక్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే నేనే షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. ఆ ఓవర్‌లో రెండు సందర్భాల్లో డబుల్స్ తీసుకునే అవకాశం వచ్చినప్పటికీ.. రన్‌అవుట్ అయితే మరింత నష్టం జరుగుతుందని భావించా. ఆ సమయంలో నెట్ రన్‌రేట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని స్కోరును సాధ్యమైనంత పెంచాలని చూశా. కానీ చివరకు నేను ఒక్క పరుగు కూడా చేయలేకపోయా’ అని వివరించాడు.

‘మ్యాచ్ పరిస్థితి తెలియకుండా బయటివారు చేసే వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి. నేను పలు ఫ్రాంచైజీ లీగ్‌లకు వెళ్లేది క్రికెట్ ఆడుతూ నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికే. ఇలాంటి ట్రోలింగ్ నా క్రికెట్ కెరీర్ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందేమోననే ఆందోళన కలిగింది. ఇంకో టోర్నమెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడి వారు నా గురించి ఏమనుకుంటారు?, నన్ను ఎలా చూస్తారు? అనే ఆలోచనలు కూడా నాలో కలిగాయి. నిరంతర ట్రోలింగ్ వల్ల మానసికంగా ఇబ్బంది ఎదురైనప్పటికీ.. నేను ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగా’ అని విజయ్ శంకర్ చెప్పాడు. 35 ఏళ్ల విజయ్ ఈ ఏడాది దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు దూరమై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఎల్‌పీఎల్‌ అనంతరం ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ తరఫున ఆడుతున్నాడు.

విజయ్ శంకర్ భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. 2019 వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. త్రీడీ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తెలుగు తేజం అంబటి రాయుడు స్థానంలో టీమిండియాలోకి వచ్చిన విజయ్.. పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో అతడిపై అప్పట్లో విమ్మర్శలు కూడా వచ్చాయి. రాయుడు కూడా పలు సందర్భాల్లో ఈ విషయంపై స్పందించాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు విజయ్ ప్రాతినిధ్యం వహించాడు.