
Nitish Kumar Reddy: అంతర్జాతీయ క్రికెట్లో ఒడిదుడుకులు ఎదురైనా, పట్టుదల ఉంటే ఎలా పుంజుకోవచ్చో తెలుగోడైన యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నిరూపించారు. అఫ్ఘానిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లలో అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచారు. తొలి మ్యాచ్లో గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కొన్న నితీష్, ఈ మ్యాచ్లో తన అద్భుతమైన బౌలింగ్తో విమర్శకుల నోళ్లు మూయించారు.
ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. తాను వేసిన మూడు ఓవర్ల స్పెల్లో ప్రతి ఓవర్ తొలి బంతికి వికెట్ తీసి అఫ్ఘాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశారు. తన మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. తద్వారా తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 9వ ఓవర్లో బంతిని ఆయన చేతికి అందించగా, ఆరంభం నుంచే అఫ్ఘాన్ బ్యాటర్లను వణికించారు.
తొలుత తన మొదటి ఓవర్ మొదటి బంతికే కుదురుకున్న అఫ్ఘాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ను పెవిలియన్కు పంపారు. ఆ తర్వాత తన తదుపరి ఓవర్ మొదటి బంతికి అనుభవజ్ఞుడైన గుల్బదిన్ నాయబ్ను, ఆ తర్వాత చివరి ఓవర్ మొదటి బంతికి ప్రమాదకరంగా మారుతున్న రషీద్ ఖాన్ (28 పరుగులు) వికెట్ను తీశారు. నితీష్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా భారత జట్టు అఫ్ఘానిస్తాన్ను 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే కట్టడి చేయగలిగింది.
సిరీస్ తొలి టీ20 మ్యాచ్లో నితీష్ రెడ్డి రెండు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఎలాంటి వికెట్ తీయలేకపోయారు. దీంతో ఆయన ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఢిల్లీలోని ఫ్లాట్ పిచ్పై అద్భుతమైన లెంగ్త్ తో బౌలింగ్ చేసి తాను ఏ జట్టుకైనా ఎంత ముఖ్యమో నిరూపించారు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో భారత్కు భవిష్యత్తులో నమ్మకమైన పేస్ ఆల్ రౌండర్గా నితీష్ ఎదుగుతున్నారని ఈ ప్రదర్శన స్పష్టం చేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..