
వినాయకుడు అంటేనే ఉండ్రాళ్ళ ప్రియుడు. అందుకే వినాయక చవితి రోజున స్వామివారికి నైవేద్యంగా ఏది వండిన వండక పోయిన ఉండ్రాళ్ళ పాయసం మాత్రం తప్పకుండా ప్రతి ఇంట వండి పెడతారు. వినాయకుడి ఫొటోల లోను స్వామివారి చేతిలోనో లేదా స్వామి వారి ముందు నైవేద్యం ప్లేట్ లోనో అతనికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కూడా మనకు దర్శనం ఇస్తాయి. అందుకే మనం కూడా అతని పూజలో అతనికి ఇష్టమైన ఉండ్రాళ్ళను ఓ పాత్రలో లేదా సంప్రదాయ బద్దంగా అయితే ఆకులో పెట్టీ నైవేద్యంగా స్వామి వారి ముందు పెట్టడం సర్వ సాధారణం. కానీ ఓ ప్లేటు తోనో, లేదా ఆకులోనో కాదు ఏకంగా లక్ష ఉండ్రాళ్ళను ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తే.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్య పేటలో ఉన్న దేవి ఆశ్రమంలో వినాయకుడికి ఉండ్రాళ్ళతో ముంచెత్తేశారు భక్తులు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి ఆశ్రమంలో వినాయకుడికి ప్రీతికరమైన రోజు అయిన బుధవారం లక్ష ఉండ్రాళ్లతో భక్తిశ్రద్ధలతో హోమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓ వైపు లక్ష మంత్రోచ్ఛరణలు జరుగుతుండగా మరో వైపు భక్తులు తయారు చేసిన ఉండ్రాళ్ళను హోమ గుండంలో వేస్తూ స్వామివారికి సమర్పించారు.

భాస్కర శర్మ – దేవి ఆశ్రమ పీఠాధిపతి
దేవి ఆశ్రమ పీఠాధిపతి బాల భాస్కర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ గత కొన్నేళ్లుగా ప్రతియేట వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ యేడాది ఉత్సవాల్లో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య బుధవారం ఉదయం నుoడి మధ్యాహ్నం వరకు లక్ష ఉండ్రాళ్ళ హోమం కొనసాగింది. ఈ హోమంలో పాల్గొన్నవారికి సకల శుభాలు సిద్ధిస్తాయని, అనుకున్న కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయని నిర్వాహకులు భాస్కర శర్మ తెలిపారు.
Ganesha’s Grand Feast (1)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.